బ్రిక్స్ సమావేశానికి ప్రధాని మోడీ: ఉగ్రవాదం అణిచివేతే ప్రధాన అజెండా
ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం బ్రెజిల్ బయలుదేరి వెళ్లారు. ప్రపంచంలోని ఐదు బలమైన ఆర్థిక శక్తి కలిగిన దేశాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సారి ఐదు ప్రధాన రంగాలపై బ్రిక్స్ చర్చించనుంది. అవి డిజిటల్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉగ్రవాదంతో పాటు ఇతర ముఖ్య అంశాలే అజెండాగా సమావేశం జరగనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
బ్రెజిల్ అధ్యక్షుడితో భేటీ కానున్న ప్రధాని మోడీ
నవంబర్ 13-14వ తేదీల్లో ప్రధాని 11 బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. ఇదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోతో ప్రధాని భేటీ అయి పలు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జరుపుతారు. బ్రిక్స్ అంతర్గత బలోపేతం దిశగా చర్చలు జరుపుతామని ప్రధాని మోడీ అన్నారు. అద్భుతమైన భవిష్యత్తు కోసం ఆర్థిక వృద్ధి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తామని బ్రెజిల్కు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని మోడీ చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంతో పాటు డిజిటల్ ఎకానమీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఉగ్రవాదం అణిచివేతపై చర్చులు జరుపుతామని వెల్లడించారు.
కీలక పాత్ర పోషించనున్న భారత వాణిజ్యం మరియు పరిశ్రమలు
ఇక బ్రెజిల్ పర్యటనలో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన బిజినెస్ ఫోరంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. బ్రిక్స్ దేశాల అంతర్గత సంబంధాల బలోపేతానికి భారత వాణిజ్యం పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడి భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న మంచి సంబంధాల బలోపేతంపై మాట్లాడనున్నట్లు మోడీ చెప్పారు.అంతేకాదు డిఫెన్స్, సెక్యూరిటీ, వాణిజ్యం, వ్యవసాయం, ఎనర్జీ మరియు అంతరిక్ష రంగాలకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ఇక ప్రపంచంలోని అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశం బ్రిక్స్ వేదిక తనకు కల్పిస్తోందని మోడీ చెప్పారు.
ఆరవసారి బ్రిక్స్కు ప్రధాని మోడీ
ఇదిలా ఉంటే బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడం ప్రధానికి ఇది ఆరవ సారి కావడం విశేషం. 2014లో తాను తొలి బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. అదికూడా బ్రెజిల్లోనే జరిగింది. ఇక బ్రిక్స్ బిజినెస్ ఫోరం క్లోజింగ్ సెరమొనీలో కూడా ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. సమకాలిన ప్రపంచంలో జాతీయ సార్వభౌమాధికారం కోసం ఎలాంటి సవాళ్లను స్వీకరించాలి, ఎలాంటి అవకాశాలను మలుచుకోవాలనేదానిపై ప్రధాని చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత బ్రిక్స్ ప్లీనరీ సెషన్స్లో ప్రధాని పాల్గొంటారు. బ్రిక్స్ దేశాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుంది.
ఎంఓయూలపై సంతకాలు చేయనున్న బ్రిక్స్ దేశాలు
ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి బ్రిక్స్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎమ్ఓయూ)లపై దేశాలు సంతకాలు చేస్తాయని తెలుస్తోంది. బ్రిక్స్ సమూహంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. ఈ ఐదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలు కావడం విశేషం. ఈ ఐదు దేశాలు కలిపి ప్రపంచ జనాభాలో 42శాతంగా ఉన్నాయి. ప్రపంచ దేశాల జీడీపీలో 23 శాతం ఈ ఐదు దేశాల నుంచే ఉంది.