వరుడికి లెక్కలు రాలేదని పెళ్లి వద్దన్న వధువు: కరెన్సీ నోట్లిచ్చి లెక్కబెట్టమంది
లక్నో: వరుడికి లెక్కలు రాలేదని చెప్పి వధువు పెళ్లి పీటల మీదే నో చెప్పిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో శుక్రవారం నాడు జరిగింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు కరెన్సీ నోట్లు లెక్కపెట్టడంలో విఫలమయ్యాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయికి పెళ్లి ఖాయమైంది. వరుడు మనోజ్ గ్రామంలో శుక్రవారం పెళ్లి ముహూర్తం. అయితే పెళ్లి జరుగుతుండగా వ్యవహరిస్తున్న తీరును చూస్తే వరుడు నిరక్షరాస్యుడని వధువు భావించింది.
మగపెళ్లి వారు ఆ విషయాన్ని దాచి పెట్టారేమోనని గ్రాడ్యుయేట్ అయిన వధువుకు అనుమానం వచ్చింది. దీంతో అతడికి కరెన్సీ నోట్లు ఇచ్చి.. పందిట్లోనే లెక్క పెట్టమని చెప్పింది. ఆ పరీక్షలో వరుడు నెగ్గలేకపోయాడు.
అతను తెల్ల మొహం వేశాడు. ఆమె అనుమానం నిజమైంది. దీంతో, తాను అసలు ఆ అబ్బాయిని చేసుకునేదే లాదని చెబుతూ అమ్మాయి తిరస్కరించింది. ఏం చేసేది లేక ఆ అబ్బాయి, అతని తరఫు బంధువులు పెళ్లి రద్దు చేసుకొని వెళ్లిపోయారు.