మోడీ వల్లే?: నీకూ నాకూ సరిపడదంటూ పెళ్లి 'రద్దు'.. ఇదేం చోద్యం!
పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందామనుకుంటే.. విషయం మోడీ రాజకీయాల మీదకు మళ్లి ఏకంగా వివాహ రద్దుకే దారి తీసింది.
లక్నో: పెళ్లంటే జాతకాలు కలవాలి.. ముహూర్తం సెట్ అవ్వాలి.. కట్నకానుకల విషయంలో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదరాలి వంటి విషయాలు సాధారణంగానే చర్చలోకి వస్తాయి. కానీ రాజకీయాల విషయంలోను తమతో ఏకాభిప్రాయం కుదరాలని పట్టుబడితే మాత్రం.. వియ్యం కాస్త కయ్యానికి దారి తీయడం ఖాయం.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోను ఇదే జరిగింది. వియ్యం అందుకోవాల్సిన వాళ్లు కాస్త 'మోడీ' టాపిక్తో కయ్యం పెట్టుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందామనుకుంటే.. విషయం మోడీ రాజకీయాల మీదకు మళ్లి ఏకంగా వివాహ రద్దుకే దారి తీసింది. ఒకరు అనుకూలంగా, మరొకరు మోడీకి ప్రతికూలంగా వ్యాఖ్యలు చేయడంతో.. ఇక నీకూ నాకూ సరిపడదంటూ తెగదెంపులు చేసేసుకున్నారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. . యూపీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి.. కాన్పూరుకి చెందిన వ్యాపారవేత్తకి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడానికి ఇద్దరూ ఓ గుడి వద్ద కలుసుకున్నారు. మాటల్లో.. విషయం రాజకీయాల వైపు మళ్లింది. మోడీ రాజకీయాల గురించి ఒకరు అనుకూలంగా, మరొకరు ప్రతికూలంగా వాదించుకున్నారు.
చివరకు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. ఇక నీకూ నాకూ 'పెళ్లి' అనేది కుదరని వ్యవహారమని తీర్మానించేసుకున్నారు. ఇదే విషయం ఇంట్లోవాళ్లతోను చెప్పి పెళ్లిని రద్దు చేయించుకున్నారు. ఎవరెంత నచ్చజెప్పినా.. అమ్మాయి, అబ్బాయి వినకపోవడంతో చేసేదేమి లేక పెద్దలు కూడా అందుకు అంగీకరించారు. స్థానికులు మాత్రం ఇదేం చోద్యమంటూ చర్చించుకుంటున్నారు.