కరోనా చిత్రం ... ఫోన్ కు తాళి కట్టిన వరుడు .. కేరళలో వరుడు .. లక్నోలో వధువు
కరోనాకి ముందు కరోనా సమయంలో జీవితం ఊహించని విధంగా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లంటే పందిళ్ళు, సందళ్ళు , చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు , బంధువులు అటేడుతరాలు, ఇటేడుతరాలు గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా చేసేవారు . ఇక వారం రోజుల పాటు వివాహ వేడుకలు జరిగాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు . ఇక ఆ తర్వాత అది ఒక్కరోజుకు తగ్గినా ఖర్చు మాత్రం భారీగానే పెరిగింది . బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ కరోనా కాలంలో ఒక్కసారిగా ట్రెండ్ మారింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే ...
Recommended Video
కరోనాతో తెరమీదకు ఆన్ లైన్ పెళ్ళిళ్ళు
కరోనా పుణ్యమా ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. ఇక కొన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ పట్టుమని పది మంది కూడా లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ , గట్టు చప్పుడు కాకుండా పది మందికి తెలియాల్సిన అవసరం కూడా లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఇంకో కొత్త విధానం కూడా తెరమీదకు వచ్చింది .ఆన్ లైన్ లో పెళ్లి జరిగి పోతుంది. వధూ వరులు ఆన్ లైన్ లో చూసుకుంటే పురోహితుడు మంత్రాలు ఆన్ లైన్ లో చదివితే వధువుకు అక్కడే ఉన్నకుటుంబ సభ్యులు వరుడి పేరు మీద తాళి కట్టేస్తారు. ఇక దీంతో పెళ్లి తంతు ముగిసినట్టే .
కరోనా పుణ్యం ..ఫోన్ చేతిలో ఉంటే చాలు పెళ్లి చేసుకోవచ్చు
ఇక ఇప్పుడు కరోనా ప్రభావంతో పైసా ఖర్చు లేకుండా పక్క పక్కన లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. పెళ్లంటే వధూవరులు కూడా పక్కన ఉండాల్సిన పని లేకుండా చేసింది కరోనా . ఎవరెక్కడ ఉన్నా వారి చేతిలో ఫోన్ ఉంటే పెళ్లి చిటికెలో పెళ్లి కూడా జరిగిపోతుంది . తాజాగా ఓ జంట ఫోన్లోనే పెళ్లి కానిచ్చేశారు . కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్.. అలప్పుజా లో ఉండే అంజనాకు వివాహం నిశ్చయం అయ్యింది. అయితే ఊహించని కరోనా లాక్ డౌన్ తో వధువు, వధువు తల్లి, సోదరుడు లక్నోలో చిక్కుకుపోయారు . ఇక దీంతో ఆన్ లైన్ లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన వరుడు అలప్పుజాలో వధువు అంజనా బంధువు ఇంటికి వెళ్లాడు.
కేరళలో వరుడు , లక్నోలో వధువు.. ఫోన్ తో వివాహబంధం
అక్కడ వధువు తండ్రి ఉన్నారు. వరుడ్ని రిసీవ్ చేసుకుని పెళ్ళికి సిద్ధం చేశారు. పెళ్లికూతురు, ఆమె తల్లి, సోదరుడు లక్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వధూవరులిద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఫోన్లో లైవ్లోకి వచ్చారు. వెంటనే తాళిబొట్టు చేతపట్టుకుని వరుడు ఫోన్కు వెనకవైపున తాళి కట్టాడు. ఫోన్ లో కనిపిస్తున్న వధువుకు కట్టినట్టు ఫీల్ అయ్యారు . అటు వధువు తల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. దీంతో వారి పెళ్లి జరిగిపోయింది. తనకు పెళ్లి జరిగిందని, లాక్డౌన్ ముగిసిన తర్వాత రిసెప్షన్తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ జరుపుతామని కొత్త పెళ్లికొడుకు శ్రీజిత్ వెల్లడించాడు.
ఫోన్ కి తాళి కట్టి అమ్మాయికి కట్టినట్టే ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి
ఆన్ లైన్ పెళ్లి ఏమో గానీ వరుడు ఫోన్ కు తాళి కట్టటం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. లాక్ డౌన్ ముగిసే దాకా ఆగకపోయారు అని కొందరు అంటుంటే ఫోన్ కు తాళి కట్టడం ఏమిటీ ? అని కొందరు నవ్వుకుంటున్నారు. ఏం చేస్తారు పాపం కరోనా తమను ఎక్కడ దూరం చేస్తుందో అన్న భయంలో ఉన్న వారికి ఇంతకంటే మార్గం ఏం తోచలేదు . అందుకే పెళ్లి కోసం , ఇష్టపడిన అమ్మాయి కోసం ఈ తిప్పలు .