ఇందిరా గాంధీపై పోరాటం, 19 నెలలు జైల్లో, అరుణ్ జైట్లీ తండ్రిది లాహోర్, వాజ్ పేయి!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ అర్థిక మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ (66) మృతితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. విమర్శనాస్త్రాలు, వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన అరుణ్ జైట్లీ. విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే అరుణ్ జైట్లీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై పోరాటం చేసి 19 నెలలు జైల్లో గడిపారు. హైప్రొఫైల్ లాయర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ జైట్లీ వాజ్ పేయి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి అరుణ్ జైట్లీ బలమైన మద్దతుదారు. అరుణ్ జైట్లీ తండ్రిది లాహోర్.
అరుణ్ జైట్లీ ప్రస్థానం: విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్రమంత్రి వరకు...!
ఇందిరా గాంధీపై పోరాటం, ఫలితం !
ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎమెర్జిన్నీ విధించారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీ లా చదవుతున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా అరుణ్ జైట్లీ ఇందిరా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాటి విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అరుణ్ జైట్లీకి పెద్ద ఎత్తున సాటి విద్యార్థులు మద్దతు ఇచ్చారు. ఇందిరా గాంధీ ఆదేశాలతో అరుణ్ జైట్లీని అరెస్టు చేసి 19 నెలలు జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న అరుణ్ జైట్లీ ఒక సంవత్సరం లా చదవలేకపోయారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అరుణ్ జైట్లీ ఏబీవీపీలో చేరి ఢిల్లీ విభాగం చీఫ్ గా పని చేశారు. అరుణ్ జైట్లీ లా పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇండియన్ ఎక్స్ ప్రెస్ భవనం కూల్చివేయాలని ఇందిరా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు మద్దతుగా పోరాటం చేశారు. అదే సమయంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధిపతి రామ్ నాథ్ గోయంకా, న్యాయవాదులు ఎస్. గురుమూర్తి, ఫాలీనామరిన్ తదితరులు అరుణ్ జైట్లీకి పరిచయం అయ్యారు. 1987లో అరుణ్ జైట్లీ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో అదనపు సోలిటర్ జనరల్ గా అరుణ్ జైట్లీని నియమించింది.
వీవీఐపీల న్యాయవాది
అరుణ్ జైట్లీకి హై ప్రొఫైల్ లాయర్ గా మంచి గుర్తింపు ఉంది. ఎల్ కే అద్వాణీ, శరద్ యాదవ్, మాధవ్ రావ్ సింధియా తదితరుల కేసులు కోర్టులో వాదించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మాదక ద్రవ్యాలు (1999), మనీ లాండరింగ్ పై ఐరాసాలో పోరాటం చెయ్యడానికి భారత్ ప్రతినిధిగా అరుణ్ జైట్లీ వెళ్లారు.
వాజ్ పేయి మెచ్చిన నాయకుడు
1999లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సారి అరుణ్ జైట్లీ మంత్రి పదవి చేపట్టారు. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలనీ రాజీనామా చెయ్యడంతో అంత వరకు ఆయన చూసిన శాఖను అరుణ్ జైట్లీకి అప్పగించారు. పార్టీ (బీజేపీ) బాధ్యతలు స్వీకరించడం కోసం కేంద్ర మంత్రి పదవికి అరుణ్ జైట్లీ రాజీనామా చేశారు. 2003లో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రి అయ్యారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారు.
జైట్లీ తండ్రిది లాహోర్
మహారాజ్ కిషన్ జైట్లీ, రతన్ ప్రభు దంపతులకు 1952లో అరుణ్ జైట్లీ జన్మించారు. అరుణ్ జైట్లీ తండ్రి కిషన్ జైట్లీ స్వస్థలం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న లాహోర్. లాహోర్ లో కిషన్ జైట్టీ అప్పట్లో ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ తల్లి రతన్ ప్రభుది అమృత్ సర్. దేశ విభజన సమయంలో కిషన్ జైట్లీ ఢీల్లీ చేరుకుని నారాయణ వీహార్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అరుణ్ జైట్లీని ఆయన తల్లిదండ్రులు మంచి పేరున్న విద్యాసంస్థల్లో చదవించారు. అరుణ్ జైట్లీ సెయింట్ జేవియర్ స్కూల్, శ్రీరామ్ కామర్స్ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీలో లా చదివారు.
చుక్కలు చూపించిన జైట్లీ
ఢిల్లీలో అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో అరుణ్ జైట్లీ ఒకరు. కోర్టుల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వారు అని అరుణ్ జైట్లీకి మంచి పేరు ఉంది. ఆర్థిక వ్యవహారాలు, పన్ను చట్టాలు అరుణ్ జైట్లీకి కొట్టిన పిండి. ప్లీడర్ గుమస్తాలకు నేరుగా ఖర్చులకు డబ్బు చేరే విదంగా చర్యలు తీసుకున్నారు. గుమస్తాల పిల్లల చదువులకు జైట్లీనే సహాయం చేసే వారు. ఢిల్లీలోని జైట్లీ ఇంటిలోనే ఆయన సొంత ఖర్చులతో చాల మంది గుమస్తాల పిల్లల వివాహాలు జరిగాయి.
విద్యాదాత అరుణ్ జైట్లీ
అరుణ్ జైట్లీ దగ్గర గుమస్తాలుగా పని చేసిన వారి పిల్లలు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. బయట వ్యక్తులు సైతం వారి పిల్లల చదువు కోసం అరుణ్ జైట్లీ సహాయం తీసుకున్నారు. అరుణ్ జైట్లీ అమృత్ సర్ లో పోటీ చేసే సమయంలో ఆయన చలువతో అంతకు ముందే మంచి జీవితంలో స్థిరపడిన ఇంజనీర్లు, డాక్టర్లు స్వచ్చందంగా వచ్చి ఆయన గెలుపు కోసం పని చేశారు. అరుణ్ జైట్లీ పైకి కనిపించే గంభీరమైన వ్యక్తి కాదు. అరుణ్ జైట్లీ చాల మంచి మనిషి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
మోడీకి జైకొట్టిన జైట్లీ !
ప్రధాని అభ్యర్ధి విషయంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చాల మంది బీజేపీ సీనియర్లు అయోమయంలో పడిపోయారు. అయితే ఆ సమయంలో అరుణ్ జైట్లీ నరేంద్ర మోడీకి ప్రధాన మద్దతుదారుగా నిలిచారు. తరువాత నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. అరుణ్ జైట్లీ చొరవతో పెద్ద నోట్ల రద్దు, జీఎస్ టీ, దివాలా చట్టంకు కోరలు వచ్చాయి. అరుణ్ జైట్లీ మద్దతుతోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చైహాన్ బాధ్యతలు స్వీకరించారు. ఉమాభారతి తదితరులు వ్యతిరేకించినా అరుణ్ జైట్లీ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ కే మద్దతు ఇచ్చారు. దాని ఫలితం మధ్యప్రదేశ్ లో మూడు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది.