మాటల మాంత్రికుడు: చంద్రబాబుపై బృందా కారత్
నవ్యాంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్రం కొత్తగా ఏర్పడినా మహిళలకు న్యాయం జరగాలని కోరుతూ చేస్తున్న ఉద్యమాలు మాత్రం కొత్త కాదని ఆమె అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా మహిళల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఇతర రాష్ర్టాలలో భాష వేరైనా మహిళా సమస్యలు మాత్రం అన్ని ఒకేలా ఉన్నాయని, లక్ష్యాలు కూడా ఏమీ మారడం లేదని చెప్పారు.
చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల సమయంలో తాను మత శక్తులతో కలిసి పనిచేసే పని లేదని గట్గ్టిగా చెప్పారని, ఇప్పుడు కుర్చీ కోసం మాట మార్చాడని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్మార్ట్ సిటీలు అంటున్నారని, మరి అక్కడ పనివారు లేకుండా, మహిళలు, రైతులు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ధరలు తగ్గించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. చౌకధరల దుకాణాలలో మనుషులు తినడానికి వీల్లేని బియ్యం ఇస్తున్నారని, ఇది మహిళలకు కన్నీళ్ళు తెప్పిస్తోందని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ చంద్ర బాబు మంత్రగాడిలా గాలిలో చేయి తిప్పారని, ఇపుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారని, ఇదే సమయంలో మహిళలు వడ్దీ కట్టాలంటూ ఒత్తిడులు వస్తున్నాయని ఆమె అన్నారు.
మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి స్వరూప రాణి అన్నారు. చంద్రబాబు నాయుడు 70 లక్షల మంది డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. ఈ సమావేశానికి ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలిక పూర్ణ హాజరైంది.