అయోధ్యకు 2 ట్రక్కుల రాళ్లు, అఖిలేష్ యాదవ్ ఆరా
న్యూఢిల్లీ: రామ్ జన్మభూమి న్యాస్ సారథి మహంత్ నృత్యగోపాల్ దాస్ సోమవారం అయోధ్యలో శిలాపూజ నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. స్థానిక వీహెచ్పీ ప్రధాన కార్యాలయం అయిన కర సేవక్పురానికి ఆదివారం రెండు ట్రక్కుల నిండా రాళ్లు చేరాయి.
మందిర నిర్మాణం నిమిత్తం దేశవ్యాప్తంగా రాళ్లను సేకరించాల్సిందిగా జూన్లో వీహెచ్పీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహంత్ దాస్ మాట్లాడుతూ.. అయోధ్యలోకి రాళ్లు వస్తూనే ఉంటాయనీ, ఇప్పుడిక అక్కడ ఆలయం నిర్మించవచ్చనే సంకేతాలు తమకు ప్రధాని మోడీ సర్కారు నుంచి లభించినట్లు పేర్కొన్నారు.
ఈ రాళ్ల రాక గురించి ఫైజాబాద్ ఎస్ఎస్పీ మోహిత్ గుప్తా స్పందిస్తూ.. ఇప్పటి దాకా కూడా రాళ్లన్నీ ప్రయివేటు ప్రాంగణాల్లోనే ఉన్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. విహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి తమకు ఆలయం నిర్మాణం విషయంలో ఎలాంటి సంకేతాలు అందలేదని, అయోధ్యకు నిర్మాణ మెటిరియల్ రావడం ఏళ్లుగా జరుగుతోందని, కొత్తదేమీ కాదన్నారు.
కాగా, అయోధ్యలో తాజా పరిణామాలంటూ వస్తున్న మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి(హోం)లను ఆదేశించారు.
అయోధ్యకు రెండు ట్రక్కుల రాళ్లు వచ్చి చేరాయన్న తాజా పరిణామాలపై ఆంతరంగిక నివేదికను సమర్పించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఇంటెలిజెన్స్ విభాగాన్ని కోరింది. ఈ మేరకు అదనపు డైరక్టర్ జనరల్(ఇంటెలిజెన్స్)ను యూపీ సర్కారు నివేదిక కోరినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.