పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేచ్చేందుకు యోచన: ధర్మేంధ్ర ప్రధాన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరల కారణంగా పెట్రోల్, ఢీజీల్ ధరలు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించేందుకు గాను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలం నుండి విన్పిస్తోంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ చెప్పారు.
పెట్రోల్ ధరలు రికార్డుస్ధాయిలో పెరుగుతుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్ మారకంలో మార్పులు, పన్నుల వంటి మూడు కారణాలతో ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు.
శాశ్వత పరిష్కారం దిశగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఒకటని అన్నారు. దీనిపై తాము తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ 78.27కు పెరిగింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 15 పైసలు పెరిగి రూ 82.91కి చేరింది. కోల్కతా, ముంబయి నగరాల్లో పెట్రోల్ ధరలు రికార్డుస్థాయిలో లీటర్కు రూ 85 దాటాయి.
పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలను అరికట్టేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే వినియోగదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడ పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు వేయడం వల్ల కూడ వినియోగదారులపై పెట్రోల్, డీజీల్ భారం మరింత పెరుగుతున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.