మాల్యాను పంపలేం, కారణం ఇదీ: భారత్కు తేల్చిచెప్పిన బ్రిటన్
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమైన దేశం నుంచి పారిపోయిన కింగ ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాను భారత్కు తిరిగి రప్పించడంలో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి పంపించాలని ఇటీవలే యూకే ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం విజయ్ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని స్పష్టం చేసింది. యూకే చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని దేశం నుంచి పంపించివేసే అధికారం తమకు లేదని బ్రిటన్ పోలీసులు స్పష్టంచేశారు. అయితే ఈ కేసు నిమిత్తం భారత్కు అవసరమైతే ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని యూకే అధికారులు ప్రకటించారు.
విజయ్ మాల్యా పాస్ పోర్ట్ను రద్దు చేసి డీపోర్ట్ చేయాలన్న భారత విదేశాంగ శాఖ వినతిని సైతం బ్రిటన్ తోసిపుచ్చింది. విజయ్ మాల్యా నేరం చేసినట్టు తమకు ప్రాథమిక ఆధారాలు చూపాలని బ్రిటన్ అధికారులు కోరారు. ఆ తర్వాత మాల్యా కేసులో విచారణకు సహగరిస్తామని బ్రిటన్ పోలీసులు తెలిపారు.
దేశంలోని 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్లను ఎగవేసినట్లు మాల్యాపై ఆరోపణలున్నాయి. ఎలాంటి సమాచారం అందించకుండా గత మార్చి 2న విజయ్ మాల్యా లండన్కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిపై చర్యలు తీసుకోవాలని తమ డబ్బులు రికవరీ చేసేలా చూడాలని బ్యాంకులు కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి.
దీంతో మాల్యాను భారత్కు తిరిగి పంపించాలని యూకే ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ ఏప్రిల్ 29న లేఖ రాసింది. అనంతరం భారత్కు తిరిగి రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మాల్యాను పలుమార్లు హెచ్చరించినా ఆయన స్పందించలేదు. దీంతో విదేశాంగ శాఖ మాల్యా పాస్పోర్ట్ను రద్దు చేసింది.
ఆ తర్వాత ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం విజయ్ మాల్యాపై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. ఈ అరెస్ట్ వారెంట్పై స్పందించిన మాల్యా తన పాస్ పోర్ట్ను రద్దు చేసి తనని అరెస్ట్ చేస్తే ఎలాంటి డబ్బులు వసూలు చేసుకోలేరని ఆయన హెచ్చరించారు.