రిషికేశ్లో బ్రిటన్ జంటపై అటవీశాఖ సిబ్బంది దాడి
డెహ్రాడూన్: ఒక విదేశీ జంటపై అటవీశాఖ సిబ్బంది దాడి చేసిన సంఘటన ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న మహేశ్ యోగి ఆశ్రమంలో చోటు చేసుకుంది. రిషికేశ్లోని లక్ష్మన్ జూలా పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన పులుల సంరక్షణా కేంద్రం పరిధిలో ఉన్న మహేశ్ యోగి ఆశ్రమాన్ని సందర్శించేందుకు గాను గత సోమవారం ఓ బ్రిటన్ జంట ఇక్కడికి వచ్చింది. ప్రవేశ రుసుం విషయమై అటవీ శాఖ సిబ్బందికి, విదేశీ జంటకు మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రవేశ రుసుం రూ.600 అని అటవీశాఖ సిబ్బంది చెప్పగా, అది చాలా ఎక్కువని వారు అన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తలెత్తిన ఘర్షణ వివాదంగా మారడంతో అటవీ శాఖ సిబ్బందికి, బ్రిటన్ జంటకు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది.
దీంతో అటవీశాఖ సిబ్బంది తమపై దాడికి పాల్పడ్డారని బ్రిటన్ జంట ఆరోపణ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో అటవీశాఖ సిబ్బందిపై ఫిర్యాదు చేసిన యువతి పేరు ఎలీసాగా గుర్తించారు. అయితే ఈ సంఘటనను అటవీశాఖ సిబ్బంది లైట్ తీసుకుంది.
అయితే ఈ సంఘటనను బ్రిటిష్ హై కమిషన్ దృష్టికి ఆ జంట తీసుకువెళ్లినట్లు సమాచారం.