విజయ్ మాల్యా కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు.. లండన్ కు సీబీఐ అధికారులు
ఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతతో విదేశాలకు పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే ఛాన్సుంది. మాల్యాను వెనక్కి పంపించాలన్న భారత్ అభ్యర్థన మేరకు అక్కడి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. బ్రిటన్ కోర్టు విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు సీబీఐ అధికారి సాయి మనోహర్ తో పాటు మరికొందరు అధికారులు లండన్ వెళ్లారు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా ను సెలవులపై పంపింది కేంద్రం. దీంతో ఆయనకు బదులుగా సాయి మనోహర్ ను పంపించారు ఉన్నతాధికారులు.
వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016లో బ్రిటన్ కు వెళ్లిపోయారు. ఆయనపై మనీల్యాండరింగ్ తో పాటు పలు కేసులు నమోదు కావడంతో వెనక్కి పంపాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది భారత్. ఈ అభ్యర్థనపై లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే సోమవారం (10-12-2018) అక్కడి కోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. మాల్యా విషయంలో కోర్టు తీర్పు వెలువరించాక బ్రిటన్ హోంమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.