అన్నతో కలిసి వెళ్లింది..అస్తిపంజరమై కనిపించింది: 16 ఏళ్ల విద్యార్థిని విషాదాంతం..
బెంగళూరు: రెండు వారాల కిందట తన సొంత సోదరుడితో కలిసి వెళ్లిన ఓ విద్యార్థిని అస్తిపంజరమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. అదృశ్యమైన ఆ విద్యార్థిని అస్తిపంజరాలను పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిర్వహించిన డీఎన్ఏ టెస్టులో ఆ అస్తిపంజరం కనిపించకుండా పోయిన విద్యార్థినిదేనని తేలింది.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం
హతురాలి పేరు ఫియోనా స్వీడెల్ క్యుటిన్హో. 16 సంవత్సరాలు. మంగళూరులో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం (పీయూసీ) చదువుతోంది. మంగళూరు సమీపంలోని కంబ్లా పడావ్ లో తల్లిదండ్రులు, సోదరుడు శాంసన్ తో కలిసి నివసిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆమె అదృశ్యమైంది. శాంసన్ తో కలిసి మంగళూరులోని కళాశాలకు బయలుదేరిన ఆమె ఇక కనిపించలేదు. శాంసన్ మాత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి ఫ్రాన్సిప్ క్యుటిన్హో కొణిజే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
చివరిసారిగా ఫియోనా ఆమె సోదరుడు శాంసన్ తో కలిసి మంగళూరుకు వెళ్లిందని, అప్పటి నుంచి కనిపించట్లేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు సాగించినప్పటికీ.. కొలిక్కి రాలేదు. దర్యాప్తులో భాగంగా వారు ఇదివరకే ఓ సారి శాంసన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫియోనా కనిపించకుండా వెళ్లిన రోజు తాను మంగళూరుకు వెళ్లి.. తన చెల్లెలిని కళాశాలలో వదిలేశానని పోలీసులకు వివరించారు.
డీఎన్ఏను సేకరించి
దర్యాప్తు కొనసాగుతుండగానే.. మంగళూరు శివార్లలోని మలిపు ప్రాంతంలో అస్తిపంజరాన్ని గుర్తించారు పోలీసులు. దానిపై ఉన్న ఆనవాళ్లు, దుస్తుల ఆధారంగా అది ఫియోనాదేనని నిర్ధారించారు. ఫ్రాన్సిస్ క్యుటిన్హోకు సమాచారాన్ని ఇచ్చారు. డీఎన్ఏను సేకరించి చూడగా.. ఆ అస్తిపంజరం ఫియోనాదేనని తేలింది. దీనితో మరోసారి పోలీసులు శాంసన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి.. అతను నిజాన్ని అంగీకరించాడు. ఫియోనాను తానే హత్య చేశానని, మృతదేహాన్ని మలిపు ప్రాంతంలో పడేసినట్లు వెల్లడించాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.