ప్రపంచాన్ని కదలించిన ఫోటో: ఆమె ఎవరో తెలిసింది
ముంబై: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత బయటకు వచ్చిన తొలి చిత్రాల్లో ఒక ఫోటో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎయిర్ పోర్ట్లోని ప్రయాణికుల వెయిటింగ్ చైర్లో చిరిగిపోయిన దుస్తుల్లో ముఖాన రక్తపు గాయాలతో కూడిన ఓ యువతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోని పత్రికల్లో ప్రచురితమైంది.
ఇంతకీ ఆ మహిళ ఎవరన్నది ఆరోజు వెల్లడి కాలేదు. ఉగ్రదాడి జరిగిన ఇన్ని రోజులకు ఆమె గురించి పూర్తి సమాచారం తెలిసింది. ఆమె ముంబై నివాసి, జెట్ ఎయిర్వేస్లో ఇన్ఫ్లైట్ మేనేజర్గా పనిచేస్తున్న నిధి చాపేకర్. 1996లో జెట్ ఎయిర్వేస్లో చేరింది. గత కొంతకాలంగా ముంబై-బ్రస్సెల్స్ రూట్లో తన సేవలను అందిస్తోంది.
బ్రస్సెల్స్ బాంబు పేలుళ్ల ఘటనలో ప్రత్యక్షసాక్షిగా కూడా చెప్పొచ్చు. ఈనెల 22వ తేదీన బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో పేలుళ్ల జరిగిన అనంతరం అక్కడే ఉన్న బెల్జియం ముఖ ఫోటో జర్నలిస్ట్ కెటావా కర్దానా ఈ చిత్రాన్ని తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ సమయంలో నేను అక్కడ ఉండటం యాదృచ్ఛికమేనన్నారు.
ఓ పని కోసం తాను జెనీవా వెళ్లేందుకు విమానాశ్రయానికి రాగా, అదే సమయంలో పేలుళ్లు జరిగాయి. చుట్టూ పొగ తప్ప ఇంకేమీ నాకు కనిపించలేదు. ఆ తర్వాత తీవ్రగాయాలైన వారిని కాపాడే నిమిత్తం డాక్టర్.. డాక్టర్ అని కేకలు పెడుతూ జరిగిన సంఘటనను ప్రపంచానికి చూపానని అన్నారు.
ఈ క్రమంలో నా ఎదురుగా ఉన్న నిధి చాపేకర్ను ఫోటో తీసి ఫేస్బుక్లో వెంటనే యాడ్ చేశానని చెప్పుకొచ్చారు. కాగా బ్రస్సెల్స్ బాంబు పేలుళ్ల ఘటనలో జెట్ ఎయిర్వేస్కు చెందిన ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
వీరిలో ఒకరు నిధి చాపేకర్ కాగా మరోకరు అమిత్ మెత్వానీ. బాంబు పేలుళ్ల ఘటనలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నిధి చాపేకర్ కోమాలో ఉన్నట్టు వచ్చిన వార్తలను జెట్ ఎయిర్ వేస్ తోసిపుచ్చింది.
ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. నిధి చాపేకర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోని వైద్యుడు డాక్టర్ స్టీవ్ తో తాము మాట్లాడామని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.