ఘోర తప్పిదమే: హేమామాలినిపై కేంద్రమంత్రి ఫైర్
హైదరాబాద్: బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపి హేమమాలినిపై తన సొంత పార్టీ నేత, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి హేమమాలిని గాయపడగా, ఓ చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనపై తొలిసారిగా స్పందించిన కేంద్ర మంత్రి సుప్రియో ఇది చాలా క్రూరమైన తప్పు అని, హేమమాలినికే కాదు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు.
రెండేళ్ల చిన్నారి గాయాలతో రోడ్డు మీద ఉంటే పట్టించుకోకుండా వదిలేసి ఆస్పత్రికి వెళ్లడం హేమమాలిని తప్పేనని ఆయన పేర్కొన్నారు. పాపను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందని అన్నారు. ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం కూడా పాప మృతికి కారణమని చెప్పారు.
పాప తండ్రి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉంటే పాప బతికేదని.. హేమామాలిని బుధవారం ట్వీట్ చేసిన అనంతరం కేంద్ర మంత్రి పైవిధంగా స్పందించారు. పాపను తన తల్లి ఒడిలో కూర్చుబెట్టుకుని కారులో ముందు సీటులో కూర్చోవడం కూడా పాప మరణానికి కారణమైందని తెలిపారు.