కర్ణాటక సీఎంగా బీఎస్ యడ్యూరప్ప రేపు ప్రమాణస్వీకారం, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇవే లెక్కలు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెయ్యడానికి డేట్, టైం ఫిక్స్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు మే 17వ తేదీ గురువారం మద్యాహ్నం 12.20 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ (ఫ్లోర్ టెస్ట్) చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది లింగాయుత ఎమ్మెల్యేలు మద్దతుతో ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తామనిని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ పెద్దల సూచన మేరకు బీఎస్. యడ్యూరప్ప ధైర్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి సిద్దం అయ్యారని తెలిసింది. 15 రోజుల క్రితమే బీఎస్. యడ్యూరప్ప శివమొగ్గ జిల్లా శికారీపురలో మే 17వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ధీమాగా చెప్పిన విషయం తెలిసిందే.