లింగాయుత మఠాలకు అవమానం, 149 చోట్ల డిపాజిట్ గల్లంతు, నేడు సీఎం, యడ్యూరప్ప ఫైర్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి లింగాయుత మఠాధిపతులు అందర్నీ అవమానించారని మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప మండిపడ్డారు. మఠాధిపతులు అందరికీ సీఎం కుమారస్వామి క్షమాపణలు చెప్పాలని బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు. 149 చోట్ల డిపాజిట్ గల్లంతు అయినా నేడు కుమారస్వామి సీఎం అయ్యారని యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు. గురువారం బెంగళూరులోని డాలర్స్ కాలనీలో బీఎస్ యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి స్వామీజీలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సాణేహళ్ళి మఠాధిపతి భేటీ విషయంలో కుమారస్వామి వ్యంగంగా ఆరోపణలు చేశారని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. స్వామీజీలు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిన కుమారస్వామి మఠాధిపతులును అవమానించారని బీఎస్. యడ్యూరప్ప విమర్శించారు. స్వామీజీల వారివారి అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం వారి హక్కు అని యడ్యూరప్ప గుర్తు చేశారు.
Recommended Video
అశ్వమేథ గుర్రం కట్టేశాం
అశ్వమేథ యాగం గుర్రాన్ని తాము కర్ణాటకలో కట్టేశామని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. ఈ విషయంపై యడ్యూరప్ప మండిపడ్డారు. అశ్వమేథ యాగం గుర్రాన్ని మీరు కట్టేయడానికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లలో గెలిచారో ప్రజలకు మరోసారి బహిరంగంగా చెప్పాలని యడ్యూరప్ప కుమారస్వామికి సవాలు విసిరారు.
149 చోట్ల డిపాజిట్లు గల్లంతు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన జేడీఎస్ పార్టీ 149 శాసన సభ నియోజక వర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, అలాంటి పార్టీ నాయకుడు ఈ రోజు సీఎం అయ్యారని బీఎస్. యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు. కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని కుమారస్వామి మా మీద విమర్శలు చెయ్యడం సిగ్గుచేటు అని యడ్యూరప్ప మండిపడ్డారు.
ప్రజలు తిరస్కరించారు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీని 149 నియోజ వర్గాల్లో దారుణంగా తిరస్కరించారని బీఎస్ యడ్యూరప్ప గుర్తు చేశారు. జేడీఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణలేదనే విషయం కుమారస్వామి గుర్తు పెట్టుకుంటే మంచిదని యడ్యూరప్ప సూచించారు.
సీఎం చేస్తే పలకరించలేదు
హెచ్.డి. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిని చేసింది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. సీఎం చేసిన సిద్దరామయ్యను కనీసం కుమారస్వామి పలకరించలేదని, ఇది కురుబ కులస్తులు అదర్నీ అవమానించినట్లే అని బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు.
ఇరుకునపెట్టారు
గత రెండు రోజుల నుంచి బీఎస్. యడ్యూరప్ప ప్రత్యక్షంగానే మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పదేపదే పొగడ్తలతో ముంచెత్తుతూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు ఇబ్బందికరంగా తయారైనారు. బుధవారం సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి అదే వేదిక మీద ఉన్న సిద్దరామయ్యను కనీసం పలకరించకపోవడంతో కురబ కులస్తులతో పాటు సిద్దూ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సందర్బంలో ప్రధాన ప్రతిక్షం బీజేపీ సిద్దరామయ్యను పొగడ్తలతో ముంచెత్తడం మొదలు పెట్టడంతో కన్నడిగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.