కర్ణాటక గురించి ఆయనకు ఏం తెలుసు, బీజేపీ కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, యడ్యూరప్ప !
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఆ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప విరుచుకుపడ్డారు.
కేసీ. వేణుగోపాల్ కు కర్ణాటక గురించి ఏం తెలుసు అని యడ్యూరప్ప ప్రశ్నించారు. కర్ణాటకలోని ఏప్రాంతంలో అయినా వేణుగోపాల్ సంచరించారా అని యడ్యూరప్ప ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనే అంచనా కూడా వేణుగోపాల్ కు లేదని బీఎస్. యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు.
బీజేపీ నుంచి ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్, జేడీఎస్ లోకి వెల్లడం లేదని యడ్యూరప్ప అన్నారు. అసమ్మతి ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలల్లో, సీఎం కుమారస్వామి ప్రభుత్వం మీద వారు అసహనంతో ఉన్నారని, లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత సుమారు 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని యడ్యూరప్ప జోస్యం చెప్పారు.
చించోళి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ మాజీ సీఎం సిద్దరామయ్య మీద జేడీఎస్ నాయకులు పదేపదే విమర్శలు చేస్తున్నారని, ఈ వాలకం చూస్తుంటే సంకీర్ణ ప్రభుత్వం త్వరలో కుప్పకూలిపోయే అవకాశం ఉందని యడ్యూరప్ప అనుమానం వ్యక్తం చేశారు.
తుమ్మితే ఊడిపోయే సంకీర్ణ ప్రభుత్వాన్ని తాము ఎందుకు కూల్చుతామని బీఎస్. యడ్యూరప్ప ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ లో చేరరని, లక్షణంగా మా పార్టీలోనే ఉంటారని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. వేణుగోపాల్ కు కర్ణాటక మీద అవగాహనలేకుండా మట్లాడుతున్నారని యడ్యూరప్ప ఆరోపించారు.