ఇక చాలు, రాజీనామా చేయండి!: యడ్యూరప్ప తీరుపై అధిష్టానం ఆగ్రహం? రంగంలోకి బీజేపీ పెద్దలు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షకు ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లుగా వీడియో టేపులను కాంగ్రెస్ బయటపెడుతోంది. దీనిపై బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?: జేడీఎస్ దెబ్బకు దెబ్బ, బీజేపీ ఎమ్మెల్యేలకు వల
కాంగ్రెస్, జేడీఎస్లలోని పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలను ఆకర్షిస్తారనుకుంటే.. పలువురు విపక్ష సభ్యులను ఆకర్షించేందుకు డబ్బులు, మంత్రి పదవులు ఇస్తామని ఆశపెట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ వీడియోలు బయటపెట్టింది. ఈ హార్స్ ట్రేడింగ్పై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.
చదవండి: బీజేపీకి రివర్స్, జేడీఎస్ వైపు 10మంది!: యడ్యూరప్ప రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు?
చదవండి: అసెంబ్లీలో గెలిచినా.. యడ్యూరప్పకు షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కొత్త ట్రంప్ కార్డ్
బీజేపీ పెద్దల ఆగ్రహం, యెడ్డీ రాజీనామాకు ఆదేశం
ఈ నేపథ్యంలో యడ్యూరప్పను రాజీనామా చేయాలని ఆదేశించిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజల ఆగ్రహం చవిచూడటం కంటే ప్రతిపక్షంగా ఉండటమే మంచిదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ మేరకు యడ్డీని రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
బలపరీక్షకు ముందే రాజీనామా
శనివారం మధ్యాహ్నం బీజేఎల్పీలో బీజేపీ సీనియర్ నేతలు మంతనాలు జరిపారు. సీనియర్ నేతలు ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, అనంత్ కుమార్, సదానంద గౌడ, మురళీధర రావు, యడ్యూరప్ప, శ్రీరాములు, జగదీశ్ శెట్టార్ తదితరులు భేటీ అయ్యారు. అధిష్టానం ఆదేశాలపై చర్చించారని తెలుస్తోంది. దీంతో యడ్డీ బలపరీక్షకు ముందే రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.
గౌరవప్రదంగా తప్పుకోవడమే మంచిది
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆడియోలు విడుదల చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఆగ్రహంగా ఉందని అంటున్నారు. ఇలా చేస్తే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి ఉంటుందని, కాబట్టి గౌరవప్రదంగా జేడీఎస్ - కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అప్పగించడమే మంచిదని సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీలలోని ఎమ్మెల్యేలు అసంతృప్తితో రావడం వేరని, కానీ ఇంతలా ప్రలోభాలకు గురిచేసి రప్పించుకోవాల్సిన అవసరం లేదని, దానికంటే గౌరవంగా దిగిపోవాలని యెడ్డీకి సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రజలు కూడా కర్ణాటక తీరుపై ఆగ్రహంతో ఉన్నారని అధిష్టానం గ్రహించిందని అంటున్నారు.
ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు
కాగా, యడ్యూరప్ప కొడుకు, మురళీధర రావు, శ్రీరాములు వంటి నేతలు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి వారిని ప్రలోభ పెట్టినట్లుగా వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. ఇది బీజేపీకి కోలుకోలేని దెబ్బ అని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ నేతలు వరుసగా రికార్డింగులు విడుదల చేస్తున్నారు.