ప్రభుత్వ ఏర్పాటుకు వారం రోజులు టైం ఇవ్వండి, గవర్నర్ కు బీజేపీ మనవి: అత్యవసర భేటీ!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో 104 సీట్లు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి వారం రోజులు సమయం అడుగుతోంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఇంకా 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
గవర్నర్ తో భేటీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సంపూర్ణ మద్దతులేకపోయినా ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న సందర్బంగా బీఎస్ యడ్యూరప్ప మంగళవారం రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ వాజుబాయ్ వాలాతో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి వారం రోజులు సమయం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్ వాజుబాయ్ వాలాకు మనవి చేశారు.
బీజేపీ ఆందోళన
అధిక సీట్లు కైవసం చేసుకున్న బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరస్థితి ఎదురైయ్యింది. ఇదే సందర్బంలో కాంగ్రెస్, జేడీఎస్ ఏకమై సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం కావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
బీజేపీ అత్యవసర సమావేశం
కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటి అయిన సందర్బంలో బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బీఎస్. యడ్యూరప్ప, మురళీధర్ రావ్, అనంత్ కుమార్, శ్రీరాములు, శోభా కరందాజ్లే తదితరులు అత్యవసర సమావేశం అయ్యి చర్చించారు.
బీజేపీకి చాన్స్ లేదు
స్వతంత్ర పార్టీ సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీకి అవకాశం లేదు, స్వతంత్ర పార్టీ సభ్యుల సంఖ్య చాల తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో జేడీఎస్ మద్దతు తీసుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. అంతకు ముందే సీఎం అభ్యర్థిగా హెచ్.డి. కుమారస్వామి పేరు ప్రతిపాధించిన కాంగ్రెస్ బేషరుతుగా జేడీఎస్ కు మద్దతు ప్రకటించి బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది.
హైకమాండ్ ఆదేశం
ఢిల్లీలోని అధిష్టానం పెద్దలు బెంగళూరు వచ్చిన తరువాత ఏం చెయ్యాలలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారిపోవడంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో వేచి చూడాలి.