నాలుగోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప: మూలాలు ఆర్ఎస్ఎస్ లో..ఉద్యోగం రైస్ మిల్లులో
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడు బీఎస్ యడియూరప్ప. ఆయన సారథ్యంలోోని కమలం పార్టీ పుష్కరకాలం కిందటే దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రం కర్ణాటకలో గద్దెను అధిష్ఠించగలిగింది. 2013 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ.. అయిదేళ్లు తిరిగే సరికి మళ్లీ దాన్ని చేజక్కించుకుంది. ఇక్కడ కూడా యడియూరప్పే కీలక పాత్ర పోషించారు. అవినీతి కేసులను ఎదుర్కొన్న యడియూరప్ప గతంలో జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆయనపై కేసులు అలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా తనను అధికారం నుంచి తొలగించి కర్ణాటక జనపక్ష పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నప్పటికీ.. ఆయన మనుగడ సాగించలేకపోయారు. మళ్లీ ఆయనకు కమలమే దిక్కయింది.
నేను నరేంద్ర మోడీలాగే ఆలోచిస్తా..నిర్ణయాలు తీసుకుంటా: రైతులకు ఏటా రూ.2000: యడియూరప్ప
రైస్ మిల్లు కుమార్తెను పెళ్లాడి..
యడియూరప్ప మూలాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ఉన్నాయి. 1965లో కర్ణాటకలో సాంఘిక సంక్షేమ శాఖ క్లర్క్ గా పనిచేశారు. అంతకుముందు స్థానికంగా ఓ రైస్ మిల్లులో ఆయన క్లర్క్ గా పనిచేశారు. అనంతరం ఆ మిల్లు యజమాని కుమార్తెను వివాహం చేసుకున్నారు. అనంతరం ఓ హార్డ్ వేర్ షాప్ ను నడిపించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 1970లో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ఆయన రాజకీయంగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ శికారిపుర యూనిట్కు కార్యదర్శిగా నియమితులయ్యారు. 1972లో జనసంఘ్ తాలుకా శాఖకు అధ్యక్షుడిగా, 1975లో శికారిపుర మున్సిపాలిటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1975లో అత్యవసర పరిస్థితి సమయంలోో జైలు పాలయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన అనంతరం అందులో కొనసాగారు. 1983లో బీజేపీ కర్ణాటక రాష్ట్రశాఖ పగ్గాలను అందుకున్నారు. అదే ఏడాది శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా ఐదుసార్లు యడియూరప్పకు శికారిపుర కంచుకోటగా మారింది. మండ్య జిల్లాలోని బూకెనకెరె యడియూరప్ప స్వస్థలం.
2007లో ముఖ్యమంత్రిగా ఏడు రోజులే..
2007లో కర్ణాటక ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీనితో బీజేపీ.. జనతాదళ్ (ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తొలి రెండున్నరేళ్లు, మలి రెండున్నరేళ్ల కాలాన్ని పంచుకోవాలని ప్రాతిపదిక మీద బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఆవిర్భవించింది. తొలి దఫాలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్లు పరిపాలించారు. అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేసి, యడియూరప్పకు అవకాశాన్ని ఇచ్చారు. వారం రోజులు కూడా తిరగక ముందే కుమారస్వామి తన మద్దతును ఉపసంహరించుకున్నారు. ఫలితంగా యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మూడేళ్లకు పైగా యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయనపై అవినీతి కేసులు నమోదు కావడంతో బీజేపీ ఆయనను పదవి నుంచి తొలగించింది.
బీజేపీకి గుడ్ బై చెప్పి..వేరు కుంపటి పెట్టి..
సదానంద గౌడను ముఖ్యమంత్రిని చేసింది. దీనితో ఆగ్రహించిన యడియూరప్ప బీజేపీకి గుడ్ బై చెప్పారు. కర్ణాటక జనపక్ష పేరుతో వేరుకుపంటి పెట్టుకున్నారు. 2013 ఎన్నికల్లో బీజేపీ, కర్ణాటక జనపక్ష ఘోరంగా ఓడిపోయాయి. ఈ ఓటమితో యడియూరప్ప మళ్లీ బీజేపీలో చేరారు. తన పార్టీలో కలిపేశారు. 2013 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో మళ్లీ హంగ్ ఏర్పడటం, యడియూరప్ప మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, బలాన్ని నిరూపించుకోలేక రాజీనామా చేయడం, కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి అధికారంలో రావడం చకచకా సాగిపోయాయి. తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీనితో యడియూరప్ప నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.