కర్ణాటకలో ఏపీబీ రద్దు ? లోకాయుక్తకు పవర్స్, యడియూరప్ప ప్రభుత్వం ప్లాన్, సిద్దరామయ్య!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏసీబీ (అవినీతి నిరోదక దళం) రద్దు చెయ్యడానికి సిద్దం అయ్యిందని సమాచారం. కర్ణాటకలో అవినీతిని అంతం చెయ్యడానికి లోకాయుక్తకు విశేష అధికారాలు కట్టబెట్టడానికి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీబీని రద్దు చెయ్యాలని కర్ణాటకలోని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది.
తెరమీదకు ఏసీబీ
కర్ణాటకలో అవినీతి ఆరోపణలు కేసులు విచారణ చెయ్యడానికి 2016 మార్చి నెలలో సిద్దరామయ్య ప్రభుత్వం ఏసీబీని ఏర్పాటు చేసింది. లోకాయుక్త పరిధిలోని కేసులు కాకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన కేసులను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీబీ ఇప్పటికే అనేక కేసులు విచారణ చేసింది.
లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు
కర్ణాటకలోని లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణల వస్తే లోకాయుక్త స్వయంగా కేసులు నమోదు చేసుకుని విచారణ చేస్తుంది. లోకాయుక్తలో ప్రత్యేకంగా పోలీసు విభాగం ఉంది. అయితే ఏసీబీ తెరమీదకు వచ్చిన తరువాత లోకాయుక్తలో కొన్ని అధికారాలకు కత్తెరపడటానికి అవకాశం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
మండిపడిన బీజేపీ
లోకాయుక్త అధికారాలను నీరుకార్చడానికే ఏసీబీని ఏర్పాటు చేశారని అనేక ఆరోపణలు ఉన్నాయి. లోకాయుక్త అధికారాలను లాక్కోవడానికి ఏసీబీ ప్రయత్నిస్తున్నదని పలువురు విమర్శలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. అయినా సిద్దరామయ్య ప్రభుత్వం ఏసీబీని ఏర్పాటు చేసి తన పంతం నెగ్గించుకుంది.
ఎన్నికల ప్రచారం
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు ఇస్తామని గత శాసన సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు ఇచ్చిన తరువాత ఏసీబీని పూర్తిగా రద్దు చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.
మంత్రివర్గం నిర్ణయం
అన్ని ఆలోచించి మంత్రి వర్గం ఏర్పాటు అయిన తరువాత చర్చించి లోకాయుక్తకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని యడియూరప్ప ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే ఏసీబీ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పినట్లు ఏసీబీ నడుచుకుంటోందని అనేక ఆరోపణలు ఉన్నాయి. అందుకే యడియూరప్ప ప్రభుత్వం ఏసీబీని రద్దు చెయ్యాలని ఆలోచిస్తోందని సమాచారం.