కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్ లో!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాల అనంతరం కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బెంగళూరు బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ బాంబు పేల్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం జూన్ రెండో వారంలో అధికారంలోకి వస్తుందని, సీఎం కుమారస్వామి ఇంటికిపోయి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారని వి. సోమణ్ణ జోస్యం చెప్పారు.
కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం జూన్ 30వ తేదీ లోపు కుప్పకూలిపోతుందని, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వం ఉండదని, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మళ్లీ సీఎం అవుతారని మాజీ మంత్రి వి. సోమణ్ణ జోస్యం చెప్పారు.
చుంచోళి, కుందగోళ శాసన సభ నియోజ వర్గాల ఉప ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగాయి. ఈ రెండు నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాదిస్తుందని, మే 23వ తేదీ ఫలితాలు వెలువడిన తరువాత రాజకీయ పరిణామాలు మారిపోతాయని మాజీ మంత్రి వి. సోమణ్ణ అన్నారు.
కర్ణాటక శాసన సభలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ బలం 104. ఉప ఎన్నికల తరువాత బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉంటారని సోమణ్ణ తెలిపారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయిన తరువాత సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు తప్పకుండా మద్దతు ఇస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ తెలిపారు.
కర్ణాటకలో కరువు తాండవం చేస్తున్నదని, అయితే ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకుండా ప్రజల సోమ్మును విచ్చలవిడిగా వృదా చేస్తున్నారని, సొంత పనుల కోసం, హోమాలకు నగదు ఖర్చు చేస్తున్నారని మాజీ మంత్రి సోమణ్ణ విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి సొంత పనుల కోసం ప్రజల సోమ్మును ఖర్చు చెయ్యడం తన రాజకీయ జీవితంలో చూడలేదని సోమణ్ణ విమర్శించారు.