బిఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్: చివరి నిమిషాల్లో...
ఢిల్లీ: ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో మంగళవారం నాడు బిఎస్ఎఫ్ చార్టర్ విమానం కూలి పదిమంది మృతి చెందారు. 11 మంది కూర్చోవడానికి ఉన్న ఆ విమానం మంగళవారం ఉదయం 9.40 నిమిషాలకు కూలిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణంగా అది కూలింది.
సాంకేతిక సమస్య కారణంగా పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని విమానాశ్రయం వైపుకు మరల్చవలసి వచ్చిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. కానీ, అంతలోనే ఆ విమానం చెట్టును ఢీకొని కూలిపోయింది.
ఈ విమానం కూలిపోయిన చివరి కొద్ది నిమిషాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. సాంకేతిక సమస్య విషయం తెలియగానే విమానంలోని కెప్టెన్ భగవతి ప్రసాద్ భట్, కో పైలట్, కెప్టెన్ రాజేశ్ శివ్రాన్లు ఏటీసీని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగారు.
ఏటీసీ నుంచి అనుమతి వచ్చాక విమానాన్ని మళ్లించారు. అయితే, అది చెట్టును ఢీకొంది. ఆ తర్వాత సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పడింది.
విమానం 1700 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ మాములుగానే సంబంధాలు కొనసాగాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అడగగానే, దాని సేఫ్ ల్యాండింగ్ కోసం తాము పలు విమానాలను మళ్లించామని ఓ అధికారి చెబుతున్నారు.