భారత్ ప్రతీకారం: నాలుగు పాక్ పోస్టులు ధ్వంసం... 25 మంది పాక్ రేంజర్ల హతం..!
శ్రీనగర్: పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘించి జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్ రేంజర్లును కోలుకోలేని దెబ్బ తీసింది.
పాక్ రేంజర్లు గురువారం నుంచి కాల్పులు జరుపుతూనే ఉన్నారు. శుక్రవారం కూడా ఈ కాల్పులు కొనసాగాయి. పాక్ రేంజర్లు యథేచ్ఛగా సాగిస్తున్న కాల్పుల్లో గాయపడిన బీఎస్ఎస్ జవాన్, హెడ్ కానిస్టేబుల్ సురేష్తోపాటు మరో ఇద్దరు పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో ఒక యువతి కూడా ఉంది.
ఈ కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడి చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆర్ఎస్ పుర, అర్నియా సెక్టార్లలో కూడా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరుపుతుండటంతో బీఎస్ఎఫ్ దళాలు ధీటుగా జవాబిస్తున్నాయి.
మరో నాలుగు పాకిస్తాన్ మోర్టార్ పొజిషన్లను బీఎస్ఎఫ్ ధ్వంసం చేసిందని, దీంతో పాక్ వైపు మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.
కుందన్పూర్, గద్యాల్, హరియా, జగ్వాల్లోని పాక్ పోస్టులు ధ్వంసమైనట్టు బీఎస్ఎఫ్ గుర్తించింది. పాకిస్తాన్ వైపు పలు అంబులెన్సులు వెళ్తున్నాయని, దీంతో అటువైపు మృతుల సంఖ్య 20 నుంచి 25 వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.