ఇండో-పాక్ సరిహద్దులో సొరంగం... చొరబాట్ల కోసమే... మరో కుట్ర బట్టబయలు...
ఉగ్రవాదుల కార్ఖానాగా మచ్చబడ్డ పాకిస్తాన్ నుంచి భారత్కు ఎప్పుడూ ఏదో ముప్పు ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో భద్రతా బలగాలు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూ వస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉన్న భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరో ఉగ్ర కుట్రను బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు బయటపెట్టాయి. ఆ సరిహద్దును ఆనుకుని ఓ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించాయి. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Recommended Video
భారత్ వైపు 50మీ. పొడవుతో సొరంగం..
సరిహద్దు కంచె నుంచి భారత్ వైపు దాదాపు 50మీ. పొడవుతో ఆ సొరంగం ఉన్నట్లు బీఎస్ఎఫ్ గురువారం(అగస్టు 27) గుర్తించింది. ఆ సొరంగ ప్రవేశం దాదాపు 25మీ. లోతు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కేవలం 400మీ. దూరంలో పాకిస్తాన్ బోర్డర్ పోస్ట్ ఉన్నట్లు చెప్పారు. సొరంగం వెలుగుచూడటంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరిన్ని సొరంగాలు ఉండే అవకాశం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దు వెంబడి 'మెగా-యాంటీ టన్నెల్' తనిఖీలను నిర్వహిస్తున్నాయి.
ప్లాస్టిక్ బ్యాగ్స్తో మూసి...
ఆ సొరంగ ఉపరితలాన్ని 8-10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలతో మూసినట్లు గుర్తించింది. ఆ బస్తాలపై పాకిస్తాన్కు చెందిన ఆనవాళ్లను గుర్తించామని... వాటిపై 'కరాచీ&షకర్గర్' అని రాసివున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వాటిపై ఉన్న తయారీ తేదీ,ఎక్స్పైరీ తేదీని బట్టి అవి ఇటీవలే మాన్యుఫాక్చర్ అయినట్లుగా గుర్తించామన్నారు.భారత్లోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూకశ్మీర్,రాజస్తాన్,గుజరాత్,పంజాబ్లలోని ఇండో-పాకిస్తాన్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ భారీగా భద్రతా బలగాలను మోహరించింది.
రాడార్స్ ఉపయోగించే యోచనలో....
తాజా ఉదంతంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు వెంబడి సొరంగాలను గుర్తించేందుకు రాడార్స్ను కూడా ఉపయోగించాలని భావిస్తున్నారు. తద్వారా ఉగ్ర చొరబాట్లకు చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు గుండా భారత్లోకి చొరబడిన ఐదుగురిని బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్తించిన సొరంగాన్ని చొరబాట్లతో పాటు ఆయుధ స్మగ్లింగ్కి ఉపయోగించుకునేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు.