సరిహద్దు దాటిన పాక్ బాలుడు: సురక్షితంగా చేర్చిన బిఎస్ఎఫ్
అహ్మదాబాద్/పెషావర్: పాకిస్థాన్కు చెందిన నాలుగేళ్ల బాలుడు అలీ సజ్జన్ గోహర్ పొరబాటున భారత్-పాక్ సరిహద్దు దాటేశాడు. విఘాకోట్-గుజరాత్ సరిహద్దుల్లో దిక్కుతోచక బిత్తర చూపులు చూస్తున్న పిల్లాడు.. విధినిర్వహణలో ఉన్న బిఎస్ఎఫ్ కంటపడ్డాడు. వారు పిల్లాడిని చేరదీశారు. ఆకలితీర్చారు.
దుస్తులు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చారు. జాగ్రత్తగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ‘శుక్రవారం రాత్రి బోర్డర్లో తచ్చాడుతున్న పిల్లాడు జవాన్ల కంటపడ్డాడు. పాక్ సైన్యానికి సమాచారం అందించి, పిల్లాడ్ని తల్లిదండ్రులకు అందించాం' అని భుజ్ రేంజ్ బిఎస్ఎఫ్ డిప్యూటీ కమాండర్ హిమాంశు గౌర్ వెల్లడించారు.
పాక్ సింధ్ ప్రాంతంలోని బదిన్ జిల్లాకు చెందిన దండారి గ్రామవాసిగా పిల్లాడ్ని గుర్తించారు. భారత్వైపు వంద అడుగుల దూరం వచ్చేసిన పిల్లాడు సింధీ తప్ప మరేమీ మాట్లాడలేకపోవడంతో, వివరాలు తెలుసుకోవడం జవాన్లకు కష్టమే అయ్యింది. పాక్ సైన్యంతో ఫ్లాగ్ సమావేశం నిర్వహించిన అనంతరం పిల్లాడ్ని అప్పగించారు. భారత జవాన్లు ప్రదర్శించిన మానవతా దృక్ఫదానికి పాక్ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా తేరుకోని పెషావర్ స్కూలు పిల్లలు
పెషావర్: పాకిస్థాన్లోని పెషావర్లోని సైనిక స్కూలుపై తాలిబన్ ముష్కరులు జరిపిన పాశవిక దాడి ఘటనను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన పిల్లలు కొందరు ఇంకా తేరుకోని స్థితిలోనే ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆ పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించే యోచనలో ఉన్నారు.
పిల్లలతోపాటు స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ సంఘటనకు సంబంధించిన భయాందోళనలు తొలగించేందుకు కౌన్సెలింగ్ ఇప్పించనున్నట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం పెషావర్, ఇస్లామాబాద్ నుంచి మానసిక వైద్యులతోపాటు ఆర్మీ వైద్య అధికారులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొందరు అధికారులతో కమిటీ వేయనున్నట్లు చెప్పారు.
దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కోలాంటి అంతర్జాతీయ సంస్థలు సహకరిస్తాయని ఆయన తెలిపారు. భయాందోళనలో ఉన్న ఇతర స్కూలు పిల్లలకు కూడా తర్వాతి విడతలో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.