పాకిస్తాన్ దుమ్ముదులిపిన భారత్, ‘ఆపరేషన్ అర్జున్’ దెబ్బకు తోకముడిచిన పాక్ రేంజర్లు!
భారత్ తాజా చర్యతో కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనిక మూకలు తోకముడిచాయి. విచ్ఛలవిడి కాల్పులతో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడే పాక్ రేంజర్లు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ అర్జున్’ దెబ్బకు దారికొచ్చారు.
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ రేంజర్లు భారత సైనికులను కాల్పులతో కవ్వించడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైంది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సైనికులను రెచ్చగొట్టడం పాకిస్తాన్ సైనికులకు ఒక హాబీలా మారింది.
భారత్ తాజా చర్యతో కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనిక మూకలు తోకముడిచాయి. విచ్ఛలవిడి కాల్పులతో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడే పాక్ రేంజర్లు భారత్ చేపట్టిన 'ఆపరేషన్ అర్జున్' దెబ్బకు దారికొచ్చారు.
దుశ్చర్యలకు తగిన గుణపాఠం...
మాటిమాటికీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో సైనిక పోస్టులతో పాటు, పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ రేంజర్లు గత కొద్ది వారాలుగా కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ దుశ్చర్యలను ఎన్నిసార్లు తిప్పికొట్టినా పాక్ రేంజర్లు దారికి రాకపోవడంతో.. చివరికి భారత సైన్యం ‘ఆపరేషన్ అర్జున్' పేరిట గుణపాఠం చెప్పే చర్యలు చేపట్టింది.
ఏమిటీ ‘ఆపరేషన్ అర్జున్'...?
పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, సైనికాధికారులు, మాజీ సైనికులకు సరిహద్దుల్లో నివాస స్థలాలు ఇచ్చింది. వీరింతా అక్కడ నివసిస్తూ.. భారత్కు వ్యతిరేకంగా పాక్ జరిపే సైనిక కార్యకలాపాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ను లొంగదీసుకునేందుకు భారత్ ఇప్పుడు సరిగ్గా వీటినే లక్ష్యంగా చేసుకుని చిన్నపాటి, మధ్యతరహా, ఏరియా వెపన్స్తో ఆపరేషన్ ప్రారంభించింది.
ఏం చేశారంటే...
‘ఆపరేషన్ అర్జున్' లో భాగంగా సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐ, సైనికాధికారులు, మాజీ సైనికుల నివాసాలపై భారత బీఎస్ఎఫ్ జవానులు భీకర కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్ వైపు భారీ ఆస్తినష్టంతో పాటు ఏడుగురు పాకిస్తాన్ సైనికులు, 11 మంది పౌరులు చనిపోయినట్టు సమాచారం.
దెబ్బకు దిగొచ్చిన పాక్ అధికారులు...
భారత్ చర్యతో పాక్ సైన్యం వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ రేంజర్స్ పంజాబ్ డీజీ మేజర్ జనరల్ అజ్గార్ నవీద్ హయత్ఖాన్ హుటాహుటిన వచ్చి బీఎస్ఎఫ్ డైరెక్టర్ కేకే శర్మను కలుసుకున్నారు. కాల్పులు నిలిపివేయాలంటూ అభ్యర్థించారు. పాకిస్తాన్ లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ తన రెచ్చగొట్టే ప్రవర్తన మానుకోకుంటే మరింత ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హయత్ఖాన్తో ఈ సందర్భంగా కేకే శర్మ చెప్పినట్టు సమాచారం.
‘ఆపరేషన్ అర్జున్' వెనుక...
నిజానికి భారత్పై పాక్ కాల్పులను తిప్పికొట్టేందుకే ‘ఆపరేషన్ అర్జున్' ప్రారంభించినప్పటికీ... దీని వెనుక పశ్చిమ సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను పునరుద్ధరించే ఉద్దేశం కూడా భారత్ కు ఉంది. గతేడాది పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ రేంజర్లు ఇదే తరహాలో రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దీంతో అప్పట్లో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ రుస్తాన్' చేపట్టింది. అప్పుడు కూడా పాక్ రేంజర్లు భారత కాల్పుల ధాటికి తట్టుకోలేక ఆపరేషన్ నిలిపేయాలంటూ వేడుకోవడం విశేషం.