పాకిస్థాన్ భూభాగంలోకి 200 మీటర్ల వరకు వెళ్లొచ్చిన బీఎస్ఎఫ్ టీమ్: ఆ సొరంగం గుండానే..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఇటీవల భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో హతమైన పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు మార్గంపై బీఎస్ఎఫ్ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. సరిహద్దు గుండా కాశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ ద్వారం ఆరంభం పాకిస్థాన్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
ఇందుకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకే తాజాగా బీఎస్ఎఫ్ బృందం సొరంగంలోకి వెళ్లొచ్చినట్లు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా వెల్లడించారు. ఉగ్రవాదులు చొరబాటు పాల్పడిన సొరంగ ఆరంభ మార్గాన్ని కనుగొనేందుకు బీఎస్ఎఫ్ బృందం బయలుదేరి వెళ్లింది. వారు సొరంగం వెంట 200 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి ప్రయాణించారు. ఆ సొరంగం ప్రారంభ ద్వారం పాకిస్థాన్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
బీఎస్ఎఫ్ బృందం తిరిగి వచ్చేటప్పుడు సాక్ష్యాధారాల కోసం అందులోని దృశ్యాల్ని రికార్డు చేసి తీసుకువచ్చారని రాకేశ్ ఆస్తానా తెలిపారు. జమ్మూకాశ్మీర్లోని నగ్రోటాలో నవంబర్ 19న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Recommended Video
ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. నలుగురు ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన ఈ సొరంగ మార్గాన్ని నవంబర్ 22న భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే లోతుగా విచారణ జరిపి పాక్లోని ప్రారంభ ద్వారాన్ని కూడా కనుగొన్నారు.