భారత్పై పాకిస్తాన్ భారీ కుట్ర, 14 అడుగుల సొరంగంలో యుద్ధ సామాగ్రి
భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ మరో భారీ కుట్రకు తెరతీసింది.
శ్రీనగర్: భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ మరో భారీ కుట్రకు తెరతీసింది. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్లోకి పెద్ద సొరంగం తవ్వి దాని ద్వారా ఉగ్రవాదులను పంపాలన్న దాయాది పన్నాగాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది.
జమ్ము కాశ్మీర్లోని అర్నియా సెక్టారులోని అంతర్జాతీయ సరిహద్దులో 14 అడుగుల పొడవైన సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. అర్నియా సబ్ సెక్టార్లోని డమలా నల్లా వద్ద ఈ సొరంగాన్ని గుర్తించినట్టు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
భారీ విధ్వంసానికి కుట్ర
పండగ సమయంలో భారత్లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర పన్ని ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో ఉగ్రవాదులతో వినాశనం సృష్టించడానికి పథకం రచించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
పెద్ద ఎత్తున ఉగ్రవాదులను తరలించేందుకు
భారత భూభాగంలోకి చొరబాటును అడ్డుకోవడానికి ఉపయోగించే కంచె వద్ద ఈ సొరంగ మార్గాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. పండగ సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించడానికి పెద్దఎత్తున ఉగ్రవాదులను తరలించేందుకు ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.
సొరంగంలో యుద్ధ సామాగ్రి
అంతర్జాతీయ సరిహద్దు గుండా విక్రమ్, పటేల్ పోస్టుల మధ్య పారిశుధ్య పనులు చేపడుతుండగా నిర్మాణ దశలో ఉన్న ఈ సొరంగాన్ని గుర్తించినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు యుద్ధానికి అవసరమయ్యే సామగ్రిని ఉంచే ఏర్పాట్లు కూడా సొరంగంలో ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. పలు ఆయుధాలను, ఆహార పదార్థాలను కూడా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
సొరంగం గుర్తించడం రెండోసారి
అంతర్జాతీయ సరిహద్దులో ఇలాంటి సొరంగ మార్గాలను గుర్తించడం ఇది గత ఏడు నెలలో రెండోసారి. గతంలో సాంబాసెక్టార్లోని రామ్ఘర్లోనూ ఇలాంటి సొరంగ మార్గాన్నే సరిహద్దు దళాలు గుర్తించాయి. కాగా, ఈ సొరంగ నిర్మాణం చేపట్టేందుకే కొన్ని రోజులుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సైనికుల దృష్టిని మరల్చే యత్నం చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.