ఉద్యోగులకు కష్టమేనా: బీఎస్ఎన్ఎల్లో సంక్షోభం తలెత్తిందా..మంత్రి రవిశంకర్ చెబుతున్నదేమిటి..?
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్లో కొనసాగుతున్న సంక్షోభంపై కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో కొన్ని లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగస్తులకు అధిక ఖర్చులు, బీఎస్ఎన్ఎల్లో 4జీ సేవలు లేనందున ఈ పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి వస్తున్న పోటీతో బీఎస్ఎన్ఎల్ మరుగున పడే పరిస్థితి వస్తోందన్నారు. 4జీ కేటాయింపుల సమయంలో ప్రభుత్వం రంగ సంస్థల జోక్యం లేదు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలు జోక్యం చేసుకుంటే ప్రభుత్వం వాటిని వెనకేసుకొస్తూ ప్రవేట్ ఆపరేటర్లను విస్మరిస్తోందనే వాదన తెరపైకి వస్తుందనే దూరంగా ఉన్నాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కచ్చితంగా బీఎస్ఎన్ఎల్ను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ఇక ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల జీతభత్యాలు ఇతరత్రా ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు.ఒక్క బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిపై 75.06శాతం ఖర్చు చేస్తున్నామని అదే ఎంటీఎన్ఎల్ ఉద్యోగిపై 87.15శాతం మొత్తం ఆదాయం నుంచి వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ ఉద్యోగులపై కేవలం 2 నుంచి 5శాతం మాత్రమే తమ మొత్తం ఆదాయం నుంచి వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.ఇక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పిన రవిశంకర్ ప్రసాద్... ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
Recommended Video
ఇదిలా ఉంటే ఉద్యోగస్తులపై ఇంత వెచ్చిస్తున్నామన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఖండించారు. ప్రైవేట్ ఆపరేటర్లు తమ ఉద్యోగస్తులకు పని చేసే చోటు ఆప్షన్ ఇస్తారని అదే ప్రభుత్వ రంగ సంస్థలో మాత్రం ఆ చాయిస్ లేదని అన్నారు. మొత్తానికి బీఎస్ఎన్ఎల్ సంస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. ఇక ఉద్యోగస్తుల జీతభత్యాలు ఇతరత్రా ఖర్చులను సమీక్షిస్తామని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ అభివృద్ధి కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్లతో జతకట్టామని పార్లమెంటులో రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.