లుకౌట్ : జియో బ్రాడ్బ్యాండ్ సేవలకు ధీటుగా.. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు
న్యూఢిల్లీ: జియో రంగప్రవేశంతో టెలికాం కంపెనీల మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. డేటా ప్లాన్లకు తక్కువ ధరకే జియో అందించడంతో మిగతా టెలికాం సంస్థలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ యుద్ధం బ్రాడ్బాండ్ వైపు కదులుతోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ సేవల్లో జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఆకర్షణీయమైన డేటా ప్లాన్లు, వాయిస్ కాల్ ప్లాన్లను ఆవిష్కరించిన బీఎస్ఎన్ఎల్ ఇప్పడు బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా అంతే అట్రాక్టివ్ ధరలతో అందించేందుకు ముందుకు రానుంది.
శ్రీదేవి టెలివిజన్ సంస్థతో జతకట్టిన బీఎస్ఎన్ఎల్
టీవీ సర్వీస్ ప్రొవైడర్ అయిన శ్రీదేవీ టెలివిజన్ సంస్థతో జతకట్టిన బీఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే బ్రాడ్ బ్యాండ్ సేవలకు శ్రీకారం చుట్టింది. రూ.888తో ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక వినియోగదారులు కేబుల్ టీవీ ప్లాన్ను వేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది రూ.243 నుంచి ప్రారంభం కానుంది. ఈ భాగస్వామి కింద బీఎస్ఎన్ఎల్ మొత్తం 10 ప్లాన్లకు శ్రీకారం చుట్టింది. శ్రీదేవి టెలివిజన్ ఆపరేటర్ అందిస్తున్న కేబుల్ టీవీ ప్లాన్లతో పాటు పైన పేర్కొన్న 10 ప్లాన్లలో నుంచి ఒక ప్లాన్ను వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్లాన్లు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది బీఎస్ఎన్ఎల్.
ట్రిపుల్ పే ప్లాన్ ఎలా పనిచేస్తుంది..?
ఇక ట్రిపుల్ ప్లే ప్లాన్ ఎలా పనిచేస్తుందనేది చాలామందికి సందేహం ఉండొచ్చు. ఉదాహరణకు వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ రూ.1277 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ను ఎంపిక చేసుకుని శ్రీదేవీ టెలివిజన్ కేబుల్ ప్లాన్ను రూ.333తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో రూ.1277తో పాటు రూ.333 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం జీఎస్టీతో కలపకుండా రూ.1610 చెల్లించాల్సి ఉంటుంది. 18శాతం జీఎస్టీ ఎలాగూ కట్టాల్సి ఉంటుంది.
బీఎన్ఎన్ఎల్ నుంచి యాడ్ఆన్ ప్లాన్లు
బీఎస్ఎన్ఎల్ ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్ కింద బ్రాడ్ బ్యాండ్ యాడ్ ఆన్స్ను కూడా లాంచ్ చేసింది. ఈ యాడ్ఆన్ల ద్వారా అదనంగా డేటా ఇవ్వడం జరుగుతుంది. ఈ యాడ్ఆన్ ప్యాక్లు తక్కువ ధరకే లభించనున్నాయి. రూ. 100 చెల్లిస్తే అదనంగా 2జీబీ డేటా వస్తుండగా రూ.200 చెల్లిస్తే 5జీబీ అదనపు డేటా వస్తుంది. అంతేకాదు రూ.300తో 10 జీబీ అదనపు డేటా ఇస్తుండగా.. రూ.500తో 20 జీబీ అదనంగా డేటా లభిస్తుంది. ఇలాంటి ఆకర్షణీయమైన ప్లాన్లు అందిస్తూ బ్రాడ్బ్యాండ్ సేవల్లో జియోకు పోటీనిచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తయారవుతోంది.