రాత్రంతా ఫ్రీ: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్, మార్కెటింగ్ నిలుపుకునేందుకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ల్యాండ్ ఫో నుండి లోకల్ లేదా ఎస్టీడీకి రాత్రంతా ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ల్యాండ్లైన్ మార్కెట్లో చేజారిపోతున్న ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి రాత్రి పూట అన్ లిమిటెడ్ ప్లాన్ను ఇస్తోంది.
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ను వాడే వారిది, ఏ ప్యాకేజీ అయినా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడింటి వరకూ ఏ నెట్వర్క్ లేదా ఏ ఫోన్కైనా ఎంత సేపైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ల్యాండ్లైన్ కనెక్షన్లలోవాయిస్ కాల్స్ మాత్రమే ఉన్నవి, వాయిస్తో పాటు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా ఉండేవి, వాయిస్ కాల్స్లో స్థానిక, ఎస్టీడీ కాల్స్కు వివిధ ప్యాకేజీలతో పలు స్కీములు ఉంటాయి.
ఈ ఆఫర్ ఏ స్కీము లేదా ప్యాకేజీ ఉన్న బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్కైనా వర్తిస్తుంది. మొబైల్ మార్కెట్ను కైవసం చేసుకున్న ప్రైవేటు టెలికం ఆపరేటర్లు ల్యాండ్లైన్ మార్కెట్లోకి కూడా దూసుకొస్తుండడంతో బీఎస్ఎన్ఎల్ ఈ అన్లిమిటెడ్ దారిలోకి వచ్చిందని విశ్లేషకుల అంచనా.
మొబైల్ ఫోన్లలో పెద్దగా ప్రభావం లేకున్నా ల్యాండ్ లైన్ కనెక్షన్లలో మాత్రం దేశంలో బీఎస్ఎన్ఎల్దే పైచేయి. ఇలాంటి మార్కెట్లోకి ప్రైవేట్ ఆపరేటర్లు వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,62,556 మంది కస్టమర్లను బీఎస్ఎన్ఎల్ కోల్పోయింది. వీరిలో ఎక్కువ మంది ఎయిర్టెల్ కనెక్షన్లను తీసుకున్నారు. అయినా ఇప్పటికీ దేశంలోని ల్యాండ్లైన్ కనెక్షన్లలో 62.26 శాతం బీఎస్ఎన్ఎల్వే.
దేశంలో 96 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉంటే, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 2.70 కోట్లకు పడిపోయింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. గత ఫిబ్రవరి ఆఖరుకు దేశంలో బీఎస్ఎన్ఎల్కు 1.66 కోట్ల ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి. తాజా పథకం వల్ల ల్యాండ్ లైన్ ఫోన్లకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, దీనిని ఆరు నెలల తర్వాత సమీక్షిస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.