బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్: 1000 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సదుపాయం
ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సెకనుకు 1,000 మెగాబైట్ల (ఎంబిపిఎస్) వరకు డౌన్లోడ్ వేగంతో కూడిన బ్రాడ్బ్యాండ్ సర్వీసునుఅందుబాటులోకి తెచ్చింది.
ముంబై: ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సెకనుకు 1,000 మెగాబైట్ల (ఎంబిపిఎస్) వరకు డౌన్లోడ్ వేగంతో కూడిన బ్రాడ్బ్యాండ్ సర్వీసునుఅందుబాటులోకి తెచ్చింది.
ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీ ద్వారా అందించే ఈ సేవలను టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ నెట్వర్క్ ద్వారా సెకనుకు 100 మెగాబైట్ల డౌన్లోడ్ వరకు వేగంతో మాత్రమే బ్రాడ్బ్యాండ్ సర్వీసులను అందిస్తోంది.
ఇప్పుడీ వేగం 1,000 ఎంబీపీఎస్ కు పెరిగిపోయింది. ''బీఎస్ఎన్ఎల్ 44 నగరాల్లో (రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలు) ఎన్జి-ఒటిఎన్ (నెక్ట్స్ జనరేషన్ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్) టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసింది. ఈ ప్రాజెక్టు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడతల వారీగా 100 ప్రధాన నగరాలకు విస్తరణకు అవకాశం ఉంది'' అని మనోజ్ సిన్హా తెలిపారు.
మూడు విడతల్లో రూ.330 కోట్లపెట్టుబడితో ఎన్జి-ఒటిఎన్ను అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత 10జి సామర్థ్యాన్ని 100జి సామర్థ్యానికి పెంచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టు మూలంగా బీఎస్ఎన్ఎల్ సామర్థ్యం పది రెట్లు పెరిగిందని, దీంతో పది రెట్లు ఎక్కువ వేగంతో ఉన్న కొత్త ప్లాన్లను అందించడానికి అవకాశం కలుగుతుందని బిఎ్సఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. దీంతో లాండ్లైన్, ఎఫ్టిటిహెచ్, మొబైల్ సర్వీసుల కస్టమర్లకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
ఇప్పటి వరకు ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కింద 24 ఎంబీపీఎస్, ఎఫ్టీటీహెచ్ నెట్వర్క్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్నామని, ఇకపై ఎఫ్టీటీహెచ్ ద్వారా సెకనుకు 1 గిగాబైట్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే అవకాశం లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ సిజీఎం అనిల్ కుమార్ జైన్ తెలిపారు.