బీఎస్ఎన్ఎల్ నుంచి తొలిసారిగా ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తొలిసారిగా దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలను ప్రారంభించింది. మొబైల్ యాప్ వినియోగించి దేశంలో ఏ ఫోన్నెంబర్కైనా డయల్ చేసే అవకాశముంది. "వింగ్స్ " అనే మొబైల్ యాప్తో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడు దేశంలో ఏ నంబరుకైనా డయల్ చేయొచ్చని సంస్థ వెల్లడించింది. అంతకుముందు ఒక మొబైల్ యాప్ వినియోగించి ఫోన్ చేయాలంటే కేవలం ఆ యాప్ వినియోగిస్తున్న కస్టమర్లకు మాత్రమే ఫోన్ చేసే వీలుండేది.
ఈరోజు టెలిఫోన్ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కొత్తగా ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలను ప్రారంభించడంపై బీఎస్ఎన్ఎల్ యాజమాన్యాన్ని అభినందించారు కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా. ఈ సేవల ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏ నెట్వర్క్కు అయినా కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి చెప్పారు.
టెలికాం రంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్ర టెలికాం శాఖ ఒక టెలికాం సంస్థకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉంటే యాప్ ద్వారా కాలింగ్ సర్వీసులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కాల్స్ను మానిటరింగ్ చేసే బాధ్యత సదరు కంపెనీనే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఛార్జీలు మాత్రం ఆ టెలికాం ఆపరేటర్ల నిబంధనల ప్రకారమే ఉంటాయని వివరించింది. బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను వినియోగించుకునేందుకు ఈ వారంలోగా రిజిస్టర్ చేసుకుంటే జూలై 25 నుంచి సేవలను పొందొచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.