'యూపీ ఎన్నికల్లో మాయావతిదే హవా' : సర్వే ఏం చెబుతోందంటే!
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువున్న నేపథ్యంలో.. ఇప్పటినుంచే ఎలక్షన్ ఫీవర్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. గెలుపోటముల లెక్కలపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. తాజాగా విడుదలైన ఓ సర్వే.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతిదే హవా అని తేల్చింది.
సర్వే ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. రాబోయే ఎన్నికల్లో హంగ్ ఏర్పడనుందని, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి అత్యధికంగా 169 సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 403 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో.. బీఎస్పీ 169, సమాజ్ వాదీ 74, బీజేపీ 135, కాంగ్రెస్ 15 సీట్లను దక్కించుకుంటాయని పేర్కొన్నది.
ఇదే గనుక జరిగితే.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం 47 సీట్లతో ఉన్న బీజేపీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినట్లే. అదే సమయంలో ప్రస్తుతం 28 సీట్లతో ఉన్న కాంగ్రెస్ మరింత దిగజారి కేవలం 15 సీట్లకే పరిమితం కానుందనేది సర్వే అంచనా. ఇక సీఎంగా మాయావతి అయితేనే కరెక్ట్ అని 32 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించగా.. అఖిలేష్ యాదవ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నవారు 15 శాతం మాత్రమే కావడం గమనార్హం.
దాదాపు 25వేల మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని .. ఈ సర్వే నిర్వహించినట్లు సమాచారం. పెరిగిన నేరాలు 29 శాతం, ధరల పెరుగుదల 18 శాతం, అవినీతి 16 శాతం, అభివృద్ధి లేమి 15 శాతం, నిరుద్యోగం 12 శాతం, మతపరమైన సమస్యలు 7 శాతం.. ఇలా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్ని వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నట్లుగా సర్వే ద్వారా వెల్లడయింది.