7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?
లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- ఎస్పీ కూటమి కోసం 7 సీట్లు వదిలేస్తున్నామన్న కాంగ్రెస్ ప్రకటనను ఖండించారు. 80 స్థానాల్లో మీ అభ్యర్థులనే దించుకోండంటూ చురకలు అంటించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం తమ కూటమికి ఉందని చెప్పుకొచ్చారు. 7 సీట్లు తమకు వదిలేస్తున్నామంటూ కాంగ్రెస్ చెప్పుకోవడం తగదని, అలాంటి ప్రచారం మానుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు మాయావతి.
దేశవ్యాప్తంగా పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీతో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దని మరో ట్వీట్ లో కోరారు. లోక్సభ ఎన్నికల నేపథ్యాన.. ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ, ఆర్ఎల్డీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగమవుతోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.
గాజువాక నుండి పవన్ : 1 లోక్సభ..13 అసెంబ్లీ స్థానాలకు : జనసేన జాబితా విడుదల..!
అందులోభాగంగా అమేథీ, రాయ్బరేలీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేశామన్నారు. ఆ క్రమంలోనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీఎస్పీ - ఎస్పీ కూటమికి 7 సీట్లు వదిలేస్తున్నామంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు లేవు, గిత్తులు లేవంటూ మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరు చర్చానీయాంశమైంది.