కేజ్రీవాల్ ఎఫెక్టా: బర్త్డేకి మాయా దూరం, పొత్తుపై క్లారిటీ
లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ప్రభావం బహుజన సమాజ్ పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పైన పడినట్లుగా కనిపిస్తోంది. బిఎస్పీకి మాయావతి పుట్టిన రోజు అంటే పెద్ద వేడుక. ఆమె పుట్టిన రోజును ఆ పార్టీ ఘనంగా నిర్వహించుకుంటోంది. కానీ, ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఎఎపి ప్రభావం వారిపై పడింది!
ఈసారి మాయా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకోలేదు. ముజఫర్ నగర్ అల్లర్లకు నిరసనగానే తాను పుట్టిన రోజును జరుపుకోవడం లేదని ప్రకటించారు. తన 58 పుట్టిన రోజు సందర్భంగా మాయావతి బుధవారం లక్నోలో 'సావదాన్ విశాల్ మహా ర్యాలీ' పేరుతో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీతో పొత్తు ఉండదన్నారు. సమాజ్వాది పార్టీ పాలనలో ఉత్తర ప్రదేశ్ క్రైమ్ ప్రదేశ్గా మారిపోయిందని మండిపడ్డారు. తనపై గత తొమ్మిది సంవత్సరాలుగా సాగుతున్న సిబిఐ విచారణ రాజకీయ కక్ష సాధింపు అన్నారు.
తాము వచ్చే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదన్నారు. దేశవ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. కాంగ్రెసుతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతోందని అందులో వాస్తవం లేదన్నారు. ఆరుకోట్ల ప్రజలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలోనే ఇరు వర్గాల మధ్య సఖ్యత తీసుకురాలేదని వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల మధ్య ఎలా తీసుకు రాగల్గుతారని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు. గోద్రా ఘటన దేశాన్ని కలిచి వేసిందన్నారు.