జంతువులా చూసేది: బిఎస్పీ ఎంపీ భార్యపై పనిమనిషి
న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఎంపి ధనుంజయ సింగ్ సతీమణి జాగృతి సింగ్ తనను కూడా వేధించిందని మరో పని మనిషి ముందుకు వచ్చింది. ఎంపీ భార్య తనను తీవ్రంగా కొట్టిందని, ఒంటికి నిప్పంటించిందని ప్రస్తుతం తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని ఆమె ఆరోపించారు.
తనను ఎంపీ భార్య ఓ జంతువులా చూసేదని, మోకాళ్ల మీద కూర్చో బెట్టి చేతులు ఉపయోగించకుండా అన్నం తినమని చెప్పేదని, తీవ్రంగా వేధించేదని ఆరోపించింది.
ప్రస్తుతం ఎంపి, ఆయన సతీమణిలు అరెస్టై రిమాండులో ఉన్నారు. సమాచారం మేరకు ఇంట్లో పని చేసే వారిని ఎంపీ సతీమణి జాగృతి సింగ్ పది నెలలుగా వేధిస్తోంది. దీనికి సంబంధించి 302, 307 ఐపిఎస్ సెక్షన్స్ల కింద ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదయింది.
కాగా, రేఖ అనే పని మనిషి మృతికి సంబంధించి ఎంపీ భార్య జాగృతి సింగ్ను న్యూఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విపరీతంగా కొట్టడం వల్లనే పని మనిషి మరణించిందని, గత పది నెలలుగా పని మనిషిని జాగృతి సింగ్ విపరీతంగా వేధిస్తోందని, హింసకు గురి చేస్తోందని ఆరోపణలు వచ్చాయి.