బీజేపీకే మద్దతు! కాంగ్రెస్ తప్పిదాల వల్లే సమస్యలు: మాయావతి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దు వివాదం అంశంలో తాము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని హితవు పలికారు.
ఈ విషయంలో రాజకీయాలు తగదు..
కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా, రాహుల్ తోపాట్ ఇతర నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పొరుగు దేశాలతో ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని, వీటిపై రాజకీయాలు సరికాదని వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణల పేరిట దేశంలో ఇతర సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీని వల్ల దేశ పౌరులు ఎంతో నష్టపోతున్నారని ఆరోపించారు. బలహీనవర్గాల సంక్షేమం కోసమే బీఎస్పీ ఏర్పడిందని మాయావతి చెప్పారు.
కాంగ్రెస్ వైఖరి వల్లే వలస కూలీల సమస్య..
తాము పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా మాయావతి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉండి ఉంటే బీఎస్పీ ఏర్పడేదే కాదని మాయావతి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే అనేక మంది ప్రజలు ఉపాధి కోసం వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ఆరోపించారు. వారందరికీ ఉపాధి మార్గాలు చూపించివుంటే నేడు ఈ వలస కూలీల సమస్య ఉండేది కాదని చెప్పారు.
ప్రచారానికి పరిమితం కావొద్దంటూ బీజేపీకి హితవు
ఇక కాంగ్రెస్ తప్పిదాల నుంచి బీజేపీ పాఠాలు నేర్చుకోవాలని మాయావతి హితవు పలికారు. దేశాన్ని నిజమైన స్వయం సమృద్ధిగా(ఆత్మనిర్భర్ భారత్) తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రచారాలకే పరిమితం కావదన్నారు. పెట్రో ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు. ఇప్పటికే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ పెట్రో ధరల పెంపు మరో సమస్యగా మారిందని తెలిపారు. కాగా, పెట్రోల్ ధరలు గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న విషయం తెలిసిందే.