కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికే మా మద్దతు: పూర్తి విశ్వాసం ఉందంటూ మాయావతి
లక్నో: చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తాము కేంద్ర ప్రభుత్వం, సైన్యానికి పూర్తి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. అంతేగాక, చైనా కవ్వింపు చర్యలకు భారత సైన్యం ధీటుగా బదులిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు మాయావతి బుధవారం ట్వీట్ చేశారు. 'భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద జరుగుతున్న పరిణామాలపై దేశ ప్రజలకు ఆందోళన కలగజేయడం సాధారణమే. భారత ప్రభుత్వం చైనాకు ధీటైన జవాబు ఇస్తుందని బీఎస్పీ విశ్వసిస్తోంది. అదే విధంగా ఈ విషయంలో ఎదురయ్యే పరిణామాలపై భారత ప్రభుత్వానికి, సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుంది' అని మాయావతి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
కాగా, చైనాతో సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన గురించి మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టామని అన్నారు.
దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ిన కాపాడేందుకు ఎంత వరకైనా తెగిస్తామని, ఇందులో ఏ మాత్రం అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. చైనా కవ్వింపు చర్యలను ఉపేక్షించేది లేదని, భారత సైనిక దలాలు సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని డ్రాగన్ దేశానికి గట్టి హెచ్చరిక చేశారు.