యడ్డీ కామెంట్లపై దుమారం .. జవాన్ల ధైర్య సాహసాలతో రాజకీయాలా ? అని కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిని బీజేపీ రాజకీయ వాడుకోవాలని చూడటం దుమారం రేపుతోంది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత, మాజీ సీఎం యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైటర్ల దాడులతో బీజేపీకి కలిసొస్తుందని .. కర్ణాటకలో 22 లోక్ సభ సీట్లు గెలుస్తామని మాట్లాడటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
దాడులతో రాజకీయాలా ? సుర్జేవాలా మండిపాటు
యడ్డీ కామెంట్లను రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. సైనికుల ధైర్య సాహసాలను .. పార్టీకి అన్వయించి మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 'ప్రియమైన మోదీ, జైట్లీ, 130 కోట్ల భారతీయుల ప్రయోజనం కోసం సైనికులు చేసిన దాడిని మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటారా‘ అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాణ్ దీప్ సుర్జేవాలా.
దాడులు-సీట్ల లెక్కల్లో యడ్డీ బిజీ
యడ్డీ వ్యాఖ్యలను కర్ణాటక సీఎం కుమారస్వామి తప్పుపట్టారు. వైమానిక దాడుల తర్వాత .. భారత సైన్యానికి దేశమంతా మద్దతు తెలుపుతోంది. కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి అండగా ఉంటామని స్పష్టంచేసింది. కానీ కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప మాత్రం తన లోక్ సభ సీట్ల లెక్కల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. పాక్ పై చేసిన దాడులతో తమకేమన్నా సీట్లు పెరుగుతాయని అంచనాలు వేస్తున్నారని మండిపడ్డారు.
యడ్డీ అంచనా తప్పు
దాడులతో తమకు కలిసి వస్తోందనే యడ్డూరప్ప కామెంట్లను విపక్ష కాంగ్రెస్ ఖండిస్తుంటే .. బీజేపీలో కూడా వ్యతిరేకత వస్తోంది. కేంద్రమంత్రి విజయ్ కుమార్ సింగ్ యడ్డీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 'ఒక దేశం, ప్రజల యొక్క భద్రత రక్షణ కోసం సరైన చర్యలు తీసుకుంటున్నాం, అంతే తప్ప ఎన్నికలో సీట్లు కాదు‘ అని స్పష్టంచేశారు. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో యడ్డీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు.