దారుణం: బీటెక్ ఫస్టియర్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారం-ఆస్పత్రిలో బాధితురాలు
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి అతను ఉండే పేయింగ్ గెస్ట్ హౌస్కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అత్యాచారం తర్వాత యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇంటికెళ్లాక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అలా ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఆ కుటుంబం నివసిస్తోంది. గత శుక్రవారం ఉదయం వారి కుమార్తె ఇంటి నుంచి బయటకెళ్లింది. మధ్యాహ్న సమయంలో సిమ్లిపాల్ బానుక ప్రాంతంలోని తన క్లాస్మేట్ ఉంటున్న పీజీకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై క్లాస్మేట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ ఘటనతో యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది.అయినప్పటికీ ఎలాగోలా ఇంటికి చేరుకోగలిగింది.
కూతురి పరిస్థితి చూసి షాక్ తిన్న తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడే బాధితురాలు అసలు విషయం తల్లిదండ్రులతో చెప్పింది.దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఆమె క్లాస్మేట్పై ఫిర్యాదు చేశారు. ఆ మరుసటిరోజు బాధిత యువతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... నిందితుడికి,బాధిత యువతికి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సందర్భంగా పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తర్వాత తరుచూ చాట్ చేసేవారని... అయితే ఇద్దరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా కలిశారా లేదా అన్నది తెలియదన్నారు.యువతి మెడికల్ రిపోర్ట్స్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందన్నారు.నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని... న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీకి తరలించామన్నారు. అత్యాచార సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు.బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు.
Recommended Video
నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2019లో బెంగాల్లో మహిళలపై 29,859 నేర ఘటనలు చోటు చేసుకోగా 2020లో 36,439 నేర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజస్తాన్లో 34,535,ఉత్తరప్రదేశ్లో 49,385 ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.