మాజీ ప్రధాని నెహ్రూకు స్వార్థం కోసం పాకిస్తాన్ విభజన, క్షమాపణలు చెప్పిన దలైలామా !
బెంగళూరు: భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మీద తాను చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉంటే తనను క్షమించాలని టిబెట్ బౌద్ద మత గురువు దలైలామా మనవి చేశారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకసారి తప్పుచేస్తారని దలైలామా అన్నారు.
టిబెట్ బౌద్ద మతస్తులు శుక్రవారం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు కర్ణాటక అనే కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా, సీఎం హెచ్.డి. కుమారస్వామి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన దలైలామా మాజీ ప్రధాని నెహ్రూ గురించి తాను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని అన్నారు.
బుధవారం గోవా ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దలైలామా మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానిగా మహమ్మద్ ఆలీ జిన్నాను నియమించాలని మహాత్మ గాంధీ భావించారని అన్నారు.
అయితే మహాత్మ గాంధీ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన జవహర్ లాల్ నెహ్రూ తనకు తొలి భారత ప్రధాని పదవి ఇవ్వాలని పట్టుబట్టారని దలైలామా అన్నారు. నెహ్రూ తన స్వార్థం చూసుకోవడంతో భారత్ ముక్కలు అయ్యిందని, పాకిస్తాన్ ను వేరు చేసి మహమ్మద్ ఆలీని అక్కడ ప్రధానిని చేశారని అన్నారు.
ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ తన స్వార్థాన్ని పక్కనపెట్టి ఉంటే ఈ రోజు పాకిస్తాన్ అనే దేశం ఉండేది కాదని దలైలామా అన్నారు. ఆరోజు నెహ్రూ చేసిన తప్పు వలన దేశం రెండు ముక్కలు అయ్యిందని దలైలామా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దలైలామా వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అనేక విమర్శలు రావడంతో శుక్రవారం తన వ్యాఖ్యలలో ఏమైన తప్పు ఉంటే క్షమించాలని స్వయంగా దలైలామా ప్రజలకు మనవి చేశారు.