బెంగళూరుకు బంపర్ ఆఫర్: బడ్జెట్ లో సబ్ అర్బన్ రైలుకు జైట్లీ ఓకే: రూ. 17 వేల కోట్లు!
బెంగళూరు: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2018లో బెంగళూరు నగరానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బెంగళూరు సబ్ అర్బన్ రైలుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బెంగళూరు సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ. 17 వేల కోట్లు కేటాయించారు. బెంగళూరులో 160 కిలో మీటర్ల మార్గంలో సబ్ అర్బన్ రైలు సంచరించనుంది.
1996లో ప్రతిపాధన
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ గత 20 ఏళ్లకు పైగా బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996 నుంచి ఇప్పటి వరకూ బెంగళూరుకు సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు కేటాయించాలని అనంత్ కుమార్ కేంద్ర ప్రభుత్వాలకు మనవి చేస్తూనే ఉన్నారు.
Recommended Video
పంతం నెగ్గించుకున్న మంత్రి
బెంగళూరు నగరానికి సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు కేటాయించుకునే విషయంలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీని స్వీప్ చెయ్యడానికి బీజేపీ నాయకులు సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు మంజూరు చేయించుకున్నారని సమాచారం.
బెంగళూరులో ట్రాఫిక్ నరకం
బెంగళూరు ప్రజలకు ప్రధాన సమస్య ఏమైనా ఉందా అంటే టక్కున చెప్పే మొదటి మాట ట్రాఫిక్ సమస్య. గమ్యం చేరుకోవాలంటే ప్రజలు గంటలు గంటలు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రయాణానికి అంత సమయం కేటాయించే ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు పని భారంతో ప్రతి రోజూ అవస్థలు పడుతూ అనారోగ్యానికి గురౌతున్నారు.
మెట్రో రైలు వచ్చినా తిప్పలే !
బెంగళూరు నగరంలో రెండో విడత మెట్రో రైలు సంచారం ప్రారంభం అయినా ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గడం లేదు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రైల్వే శాఖ కూడా కసరత్తులు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో బెంగళూరుకు మెట్రో సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టుకు అరుణ్ జైట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
160 కిలో మీటర్లు
సిలికాన్ సిటి బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 160 కిలో మీటర్ల మార్గంలో సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. నమ్మ మెట్రో ( బెంగళూరు మెట్రో), కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే విధంగా బెంగళూరు సబ్ అర్బన్ రైల్వే పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
బీజేపీకి ఫ్లస్ పాయింట్
బెంగళూరు నగరంలోని అనేక శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఇప్పుడు సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు మంజూరు చేయించుకున్న బీజేపీ నాయకులు త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో నగరంలో దాదాపు అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నారు.