అదొక్కటే మినహా: బడ్జెట్పై రాహుల్, మన్మోహన్, శశిథరూర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, ఉద్యోగాలు, అసంఘటిత కార్మికులు, రెండు ఇళ్లు ఉన్నవారు... ఇలా అందరూ సంతృప్తిగా ఉన్నారు. అయితే ఇది ఎన్నికల స్టంట్ అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మరో అయిదేళ్లు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా పాలించాలంటే ఎన్నికలకు ముందు రాజకీయ స్టంట్ తప్పదని కమలం పార్టీ అభిమానులు చెబుతున్నారు. అయినా ఏ ప్రభుత్వమైనా.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇలా వరాలు ఇవ్వడం కొత్తేమీ కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు బడ్జెట్ పైన విమర్శలు గుప్పించారు.
బడ్జెట్ పైన రాహుల్ గాంధీ
బడ్జెట్ పైన రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అయిదేళ్లలో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇన్నేళ్లు రైతులను నష్టపరిచి, ఇప్పుడు వారికి రోజుకు రూ.17 ఇస్తారా అని ఎద్దేవా చేశారు. ఇది వారిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు.
ఆదాయపన్ను రూ.5 లక్షలు సహా బడ్జెట్పై నరేంద్ర మోడీ ఏమన్నారంటే
బడ్జెట్ పైన మన్మోహన్ సింగ్
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతులు గుర్తుకు వచ్చారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇది కచ్చితంగా ఎన్నికల బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందని అభిప్రాయపడ్డారు. వేతన జీవులకు ఊరట, రైతులకు ఉపశమనం ఇచ్చారని, దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.
బడ్జెట్ పైన శశిథరూర్
బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రైతాంగానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని వేతన జీవులకు పన్ను మినహాయింపు ఇవ్వడం మినహా ఏ ఒక్కటీ సంతృప్తికరంగా లేదన్నారు. ఇన్కమ్ సపోర్ట్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు కేటాయించడం అంటే కేంద్రం వారికి నెలకు రూ.500 మాత్రమే లెక్కగట్టారన్నారు. రైతులు గౌరవప్రదంగా జీవించడానికి ఆ మాత్రం ఆర్థిక సహాయం సరిపోతుందా? అన్నారు.
బడ్జెట్ పైన మమతా బెనర్జీ
ప్రభుత్వం బడ్జెట్ చిట్ ఫండ్ కంపెనీలా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వ పాలన ముగుస్తున్నందున ఈ బడ్జెట్కు విలువలేదని చెప్పారు. ఈ బడ్జెట్ను ఎవరు అమలు చేస్తారని ప్రశ్నించారు.
బడ్జెట్ పైన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. 2019 మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో గోయల్ వినోదాత్మక రంగం గురించి ప్రస్తావించారు. పైరసీని అంతమొందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'యూరి: ది సర్జికల్ స్ట్రయిక్స్' సినిమాలోని ఓ డైలాగ్ గురించి ప్రస్తావించారు. నేను యూరి సినిమాను చూశానని, ఫన్తో పాటు జోష్ కూడా ఉందని చెప్పారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. బడ్జెట్ గణాంకాల గురించి చర్చించుకునే ముందు నాకో విషయం బాగా అర్థమైందని, ఎవరైనా పీయూష్ గోయల్ జోష్ ఎలా ఉందని అడిగితే సమాధానంలో ఎలాంటి సందేహం ఉండదని చమత్కరించారు. యూరి సినిమాలో హౌ ఈజ్ ది జోష్ అన్న డైలాగ్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. రాజకీయ నేతలు కూడా ఈ డైలాగ్ను బాగా వాడుతున్నారు. సినిమాలో ఓ ఆర్మీ అధికారి.. హౌ ఈజ్ ది జోష్ అని జవాన్లను అడుగుతారు. ఇందుకు వారు హై సర్ అంటారు.