బడ్జెట్ 2019: బడ్జెట్లో మధ్య తరగతికి ఊరటనిచ్చే పన్ను ప్రోత్సాహకాలు!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం రేపు (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. దీని కోసం యావత్ దేశం చూస్తోంది. ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రెండోసారి ప్రజల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకం.
ఈ బడ్జెట్లో గ్రామీణానికి వరాలు కురిపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే రైతులకు కూడా పెట్టుబడి లేదా ఇతర మార్గాల ద్వారా భారీ ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గ్రామీణ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఈ బడ్జెట్ మోడీ ప్రభుత్వానికి కీలకం కానుందని అంటున్నారు. అలాగే బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉంది. దీనిని నిలుపుకునేలా బడ్జెట్ ఉండవచ్చునని భావిస్తున్నారు.
మధ్యంతర బడ్జెట్ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఉన్నాయి.
ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూనివర్సల్ కనీస ఆదాయం)ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే, ఇన్కం ట్యాక్స్ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచవచ్చునని, ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చునని భావిస్తున్నారు. మధ్య తరగతికి పన్ను ప్రోత్సాహకాలు, రైతుల కష్టాలు తీర్చేందుకు చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
ఈసారి కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఎకనమిక్ సర్వే 2019 ఉండదు. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక సర్వేను రూపొందించరు. ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే బడ్జెట్కు ముందు ఎకనమిక్ సర్వే రూపొందిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎకనమిక్ సర్వే రూపొందిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారులు ఈ నివేదికను రూపొందిస్తారు. దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే నివేదిక ఇది.
వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి, మౌలిక వసతులు, సదుపాయాలు, ఉపాధి, నగదు సరఫరా, ధరలు, ఎగుమతి-దిగుమతులు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిల్వలు తదితర అంశాలను ఈ సర్వే విశ్లేషిస్తుంది. ఎకనమిక్ సర్వేను బడ్జెట్కు ముందు పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలపై ప్రభుత్వం చేసే ఖర్చులను విశ్లేషించుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది.