Budget 2020 : సంచలన నిర్ణయం.. ఎల్ఐసీలో వాటా విక్రయాలు,ప్రేవేటీకరణ?
Recommended Video
కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐసీకి సంబంధించి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎల్ఐసీని స్టాక్ ఎక్స్చేంజ్లో చేర్చి వాటాలను విక్రయించనున్నట్టు చెప్పారు. అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా ఉన్న ఎల్ఐసీలో వాటాలను విక్రయించడం సంచలన నిర్ణయమే అంటున్నారు. తద్వారా ఎల్ఐసీ ప్రైవేటీకరణకు రంగం సిద్దమైనట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొనడంతో.. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ను రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచినట్టు చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును జీడీపిలో 3.8 శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి 3.5 శాతానికి సడలించినట్టు తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. 2020లో జీ-20 సదస్సుకు భారత్కు వేదికగా నిలుస్తుందని.. ఇందుకోసం రూ.100కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
2021 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.3.42లక్షల కోట్లుగా సీతారామన్ తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రుణాలు రూ.4.99లక్షల కోట్లు కాగా,2021 ఆర్థిక సంవత్సరానికి రూ.5.36లక్షల కోట్లుగా తెలిపారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందన్నారు.
సామాన్యులు,మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. రూ.5లక్షలు నుంచి రూ.7.5లక్షల ఆదాయంపై పన్నును 20శాతం నుంచి 10శాతానికి తగ్గించారు. అలాగే రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయంపై 20శాతం నుంచి 15శాతానికి ట్యాక్స్ తగ్గించారు. ఇక రూ.10లక్షలు నుంచి రూ.12.5లక్షలు ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ 30శాతం నుంచి 20శాతానికి తగ్గించారు. రూ.12.5లక్షలు నుంచి రూ.15లక్షలు ఆదాయంపై పన్నును 30శాతం నుంచి 25శాతానికి తగ్గించారు. రూ.15లక్షలు ఆపై ఆదాయంపై 30శాతం పన్ను విధించారు.