Budget 2020: ఎన్ఆర్ఐలకు నిర్మలా షాక్, విదేశాల్లో ట్యాక్స్ చెల్లించకుంటే ఇండియాలో పన్ను కట్టాల్సిందే.
ఎన్ఆర్ఐలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ షాకిచ్చారు. 2020-21 బడ్జెట్లో ఎన్ఆర్ఐ స్లాబ్ పన్ను సవరించిన ఆమె.. మరో కీలక ప్రతిపాదన కూడా సమర్పించారు. విదేశాల్లో ఉండి, అక్కడ పన్ను చెల్లించని వారు ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందేనని స్పష్టంచేశారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలియజేశారు.
చట్టంలో మార్పులు..
ఆదాయపు పన్ను చట్టంలో కూడా మార్పులు చేశామని పాండే తెలిపారు. ప్రస్తుతం ఒక ప్రవాస భారతీయుడు 240 రోజులు విదేశాల్లో ఉంటే అతను ఎన్ఆర్ఐ కింద పరిగణిస్తారు. దానిని 240 రోజల నుంచి 182 రోజులకు కుదించామని స్పష్టంచేశారు. 182 రోజులు విదేశాల్లో ఉన్న వారు ప్రవాస భారతీయుడి కింద లెక్కగడుతామని చెప్పారు. దీంతో అతను పన్ను పరిధిలోకి వస్తాడని వివరించారు. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది.
ఇండియాలో ట్యాక్స్
విదేశాల్లో ఉండే సదరు ప్రవాస భారతీయుడు/ భారతీయురాలు ఆ దేశంలో పన్ను చెల్లించకుంటే భారతదేశంలో పన్ను విధిస్తామని తేల్చిచెప్పారు. ఆ దేశంలో పన్ను చెల్లిస్తే మినహాయింపు ఉంటుందన్నారు. అంతేకాదు భారతీయుడు ప్రపంచంలో ఏ దేశంలోనూ నివసించకుండే అతను భారతదేశ నివాసిగా పరిగణిస్తారు. సదరు వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదాయానికి సంబంధించి పన్ను విధిస్తామని తెలియజేశారు.
మింగుడుపడని అంశమే
ఆదాయపు పన్ను మార్పుతో విదేశాల్లో ఉండే భారతీయులకు మింగుడు పడని అంశమేనని ధ్రువ సలహాదారు దినేశ్ కనబర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు విదేశాల్లో.. ఉదహరణకు దుబాయ్ లాంటి దేశంలో ఉన్న భారతీయులకు ఆదాయపు పన్ను తక్కువగా ఉందని గుర్తుచేశారు. మరికొందరు ఇన్ కం టాక్స్ కూడా లేదని చెప్పారు. దీంతో వారంతా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని, వారి నుంచి కేంద్రప్రభుత్వం ముక్కుపిండి పన్ను వసూల్ చేస్తుందని చెప్పారు.