రైతుల ప్రయోజనానికి పెద్దపీట: 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, పంటకు మద్దతు ధర
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున జరిగిన గొడవ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే బడ్జెట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి కేటాయింపులు చేశారు. తమది రైతు సంక్షేమ సర్కార్ అని నొక్కి వక్కానించారు.
రైతుల ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని.. పంటకు 1.5 శాతం ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీనిచ్చారు. వ్యవసాయ రుణాలను గణనీయంగా పెంచుతామని.. 16.5 లక్షల కోట్లు ఇస్తామని నిర్మలా భరోసానిచ్చారు. గోధుమ పంటకు 2013-14లో రూ.33874 కోట్లు చెల్లించగా.. 2019-2020లో రూ.62802 కోట్లుగా ఉందన్నారు. అదీ 2020-2021కి 75060 కోట్లకు చేరిందని చెప్పారు.
పత్తి రైతుల చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2013-14లో రూ.90 కోట్లు ఉండగా.. 2020-2021కి 25 వేల కోట్లకు చేరిందని చెప్పారు. పంటలకు ప్రభుత్వం అందజేసే మద్దతు ధర ద్వారా 43.36 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచుతున్నామని తెలియజేశారు.