Budget 2021 : ఎవరికి బెనిఫిట్... ఈ బడ్జెట్లో విన్నర్స్ ఎవరు... లూజర్స్ ఎవరు...
ఈ దశాబ్దానికి ఇదే తొలి బడ్జెట్... కరోనా మహమ్మారితో ఉత్పత్తి,సేవా రంగాలన్నీ కుదేలై దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్న సమయంలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్... అత్యంత క్లిష్ట సందర్భంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మధ్యతరగతి ఊసే లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. అమెరికా లాంటి అగ్ర రాజ్యంలోనే ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే...భారత ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీస ఆలోచన చేయలేదనడానికి తాజా బడ్జెట్టే నిదర్శనం. అసలు ఈ బడ్జెట్ ద్వారా ఎవరికి ప్రయోజనం... ఎవరికి నష్టమన్నది ఒకసారి పరిశీలిద్దాం.
వైద్య రంగం... కార్పోరేట్ ఆస్పత్రులకు బెనిఫిట్...
కరోనా సందర్భంలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ గనుక సహజంగానే వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం ఈసారి పెద్ద పీట వేసింది. గతేడాదితో పోలిస్తే 137శాతం ఎక్కువ నిధులను వైద్య రంగానికి కేటాయించింది. సాధారణంగా ప్రతీ ఏటా జీడీపీలో 2శాతం కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే భారత్ వైద్య రంగంపై ఖర్చు చేస్తోంది. కానీ ఈసారి గతం కన్నా దాదాపు 10శాతం ఎక్కువగా రూ.2.23లక్షల కోట్ల బడ్జెట్ను ఈ రంగానికి కేటాయించింది. ఈ ప్రకటనతో కార్పోరేట్ ఆస్పత్రులైన అపోలో హాస్పిటల్స్ ఎటర్ప్రైజెస్ లిమిటెడ్,మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్,నారాయణ హృదయాలయ లిమిటెడ్, డా.లాల్ పాత్ ల్యాబ్స్ లిమిటెడ్,మెట్రోపోలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇతరత్రా ఆస్పత్రుల షేర్లు గణనీయంగా పెరిగాయి.
Array
తాజా బడ్జెట్లో కేంద్రం ఈ రంగానికి రూ.20వేల కోట్లు కేటాయించింది. జాతీయ మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టుకు ఈ కేటాయింపులు ఊతమిస్తాయి. దీని ద్వారా గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్,ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్,డీఎల్ఎఫ్ లిమిటెడ్,ప్రెస్టిజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్,లార్సెన్&టర్బో లిమిటెడ్,కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు లబ్ది పొందనున్నాయి.
మెటల్ కంపెనీలకు బెనిఫిట్
తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన 11వేల కి.మీ అదనపు హైవేలు,మెట్రో ప్రాజెక్టులు, 27 నగరాల్లో ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టులు... అలాగే కొత్త స్క్రాప్ పాలసీ ద్వారా మెటల్ కంపెనీలకు లబ్ది చేకూరనుంది. ఈ ప్రాజెక్టులకు భారీగా స్టీల్&అల్యూమినీయం అవసరమవుతుంది కాబట్టి... జిందాల్ స్టీల్&పవర్ లిమిటెడ్,జేఎస్డబ్ల్యూ లిమిటెడ్,టాటా స్టీల్,హిందాల్కో,వేదాంత,హిందుస్తాన్ జింక్,హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలకు లబ్ది చేకూరనుంది. తాజాగా స్క్రాప్ పాలసీలో వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏళ్లు,వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించే వాహనాల జీవితకాలం 15 ఏళ్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాటిని తుక్కుగానే పరిగణిస్తారు. ఆవిధంగా కొత్త వాహనాల తయారీకి అవసరమయ్యే మెటల్కు ఎప్పుడూ డిమాండ్ కొనసాగనుంది.
ప్రభుత్వ బ్యాంకులకు బెనిఫిట్..
ఈ బడ్జెట్లో ప్రభుత్వం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటును ప్రకటించింది. దీని ద్వారా నాన్పెర్ఫామింగ్(నిరర్ధక) ఆస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయనున్నారు. అలాగే ఆ ఆస్తులను ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు మళ్లించడం వంటి ప్రతిపాదన కూడా చేశారు. ఒకరకంగా బ్యాంకు రుణాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉపయోగపడుతుంది. ఇక మూలధన సహాయ నిధి కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
గ్రామీణ భారతాన్ని విస్మరించిన బడ్జెట్
బడ్జెట్-2021లో వ్యవసాయ రంగానికి 16.5లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ప్రకటించినప్పటికీ... ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అలాగే గ్రామీణ భారతాన్ని పూర్తిగా విస్మరించారు. గ్రామీణ ఆర్థికాభివృద్దికి ఎటువంటి ప్రతిపాదనలు,ప్రణాళికలు పేర్కొనలేదు. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణ ఉపాధి పథకానికై కేంద్రం సవరించిన బడ్జెట్ రూ.1.1 ట్రిలియన్ కాగా 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఇందుకోసం ప్రకటించిన బడ్జెట్ రూ.30బిలియన్లు.
మధ్య తరగతి,ఐటీకి నిరాశ.. ఆటోమొబైల్ ఎగుమతులపై సుంకాలు
తాజా బడ్జెట్ మధ్యతరగతిని తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచుతారని మధ్య తరగతి వర్గం భావించారు. కానీ బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. ఐటీ రంగాన్ని కూడా ఈ బడ్జెట్లో విస్మరించారనే చెప్పాలి. దీంతో దేశీయ ఐటీ సేవల రంగంలో దిగ్గజ కంపెనీలకు ఎటువంటి ప్రోత్సాహకం లభించలేదు. టెక్ మహీంద్ర,విప్రో,హెచ్సీఎల్,హెక్సావేర్,టీసీఎస్ వంటి సంస్థలపై ఈ ప్రభావం పడనుంది. ఇక సౌర,మొబైల్ ఫోన్ పరికరాలు,ఆటో విడిభాగాలపై కేంద్రం దిగుమతి సుంకాలను పెంచింది. దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్లో భారత ఉత్పత్తులపై మిగతా దేశాలు కూడా సుంకాలు పెంచితే పరిస్థితేంటన్నది ఒకింత ఆందోళన కలిగించే అంశం.